శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..
శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగతా వారికి వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ శబరిమలలో 39 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భక్తులు, ఆలయ సిబ్బంది, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో కేరళలో రైల్వేస్టేషన్ల నుంచి మొదలుపెట్టి శబరిమల కొండ వరకూ పలు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వార్షిక పూజల కోసం నవంబర్ 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ శబరిమలలో 39 కరోనా కేసులు గుర్తించినట్లు ట్రావెన్కోర్ దేవస్దానం బోర్డు ప్రకటించింది. ఇందులో 27 మంది ఆలయ సిబ్బందే ఉన్నట్లు తేలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా సోకిన వారందరినీ శబరిమలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రాల్లో వీరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వీరందినీ షిప్టుల వారీగా పనిచేయిస్తున్నారు. వీరంతా ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తూ నెగెటివ్గా తేలిన వారినే కొండపైకి అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనల ప్రకారం 10 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తున్నామని టీడీబీ అధికారులు తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళకు యాత్రికులు చేరుకునే ప్రాంతాలైన తిరువళ్ల, తిరువనంతపురం, చెంగనూర్, కొట్టాయం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 1000 మంది, వారాంతాల్లో 2000 మంది భక్తులను మాత్రమే యాత్రకు అనుమతిస్తున్నారు. ఏటా డిసెంబర్ 26న మండల పూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు.












Click it and Unblock the Notifications