యూపీలో గూండాలు లేరు.. సంతోషం: మహ్మద్ కైఫ్ తాజా ట్వీట్
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ యూపీ రాజకీయాలపై తరచూ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పరోక్షంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల మీద మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కు మక్కువ తగ్గలేదు. యూపీ రాజకీయాలపై తరచూ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పరోక్షంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
అక్రమ కబేళాలను నిషేధిస్తూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో లక్నోలోని ప్రఖాత 'తుండే కబాబ్' అనే కబాబ్ సెంటర్ వ్యాపారం బాగా తగ్గింది. తమకు గొడ్డు మాంసం దొరక్కపోవడంతో కబాబ్ లు తయారు చేయలేకపోతున్నామని దాని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ విషయంమీదే ఇప్పుడు మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. 'తుండే మిలే యా న మిలే.. గూండే న మిలే' అంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశాడు. అంటే.. తుండే కబాబ్ ఉన్నా లేకపోయినా గూండాలు లేకపోవడం మాత్రం సంతోషదాయకమని అర్థం వచ్చేలా చెప్పాడన్నమాట.
Tunday milein ya na milein,Gundein na milein!Will be happy to see No Gunday in UP.All illegal stuff must be stopped.Good moves #UPshouldgoUP
— Mohammad Kaif (@MohammadKaif) March 25, 2017
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గూండాలు లేకుండా ఉండే పరిస్థితి చూడటం ఎంతో ఆనందకరంగా ఉందని, మొత్తం గూండాలు, గ్యాంగ్ స్టర్లు అందరినీ రాష్ట్రం నుంచి బయటికి విసిరిపారేయాలని తన ట్వీట్ లో వ్యాఖ్యానించాడు. అక్రమ వ్యవహారాలు అన్నీ ఆపేయించాలని, ఇప్పుడంతా బాగా జరుగుతోందని అంటూ.. చివర్లో 'యూపీ షుడ్ గో అప్' అని.. రాష్ట్రం పురోగతి సాధించాలనే అర్థం వచ్చేలా పేర్కొన్నాడు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుత యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మీద పోటీ చేసి ఓడిపోయిన కైఫ్.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని వరుసబెట్టి ప్రశంసిస్తున్నాడు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కూడా 'యూపీ, ఉత్తరాఖండ్ లో సాధించిన బ్రహ్మాండమైన విజయానికి అభినందనలు..' అంటూ మోడీని, బీజేపీని ట్యాగ్ చేస్తూ కైఫ్ ట్వీట్ చేశాడు.