మధురై ఆలయ చెరువులో వేలకొద్ది చేపలు మృత్యువాత
మధురై : మధురైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న శరవణపోయ్ గాయ్ చెరువులో ఆదివారం నాడు వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆలయ పరిసరాల్లోకి విపరీతమైన దుర్గంధం వ్యాప్తి చెందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలువురు సిబ్బంధిని రంగంలోకి దించి మృత్యువాత పడ్డ చేపలను తరలించే ప్రయత్నం చేశారు.
ఎవరో దుండగులు ఉద్దేశపూర్వకంగానే చెరువు నీటిలో విష పదార్థాలు కలిపి ఉండవచ్చునని, అందుకే చేపలు చనిపోయాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి చెరువులోని చేపలన్నిమృత్యువాత పడి చెరువు మీద తేలుతూ కనిపించాయి. మధురైలోని తిరుప్పరన్ కుంద్రం ప్రాంతంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది.

కాగా, శరవణ చెరువును ప్రతీ ఏటా కొంతమంది చేపల వ్యాపారులకు లీజుకు ఇస్తు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గాను రూ.47 వేలకు ఆ చెరువు లీజు హక్కులు అమ్మినట్లు సమాచారం. చేపల మృత్యువాతతో లీజుకు తీసుకున్న వ్యక్తికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది.
ఇదంతా పక్కనబెడితే.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకునే భక్తులంతా శరవణ చెరువులో స్నానమిస్తుంటారు. శరవణ చెరువు నీళ్లను భక్తులంతా పవిత్ర జలంగా భావిస్తుంటారు. అలాంటి చెరువులో విష పదార్థాలు కలిపారన్న వార్త ఇప్పుడు భక్తుల్లోను కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications