ట్రంప్ దెబ్బకు రిస్క్ లో మూడు లక్షల ఉద్యోగాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహించని విధంగా లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చాలామంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వస్త్ర, రత్న, ఆభరణాల రంగాల పైన ట్రంప్ యొక్క టారిఫ్ ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా మార్కెట్ పైన ఎక్కువ ఆధారపడిన రంగాలలో టెన్షన్
వస్త్ర, రత్న, ఆభరణాల రంగాలలో అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడిన దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం తోటి ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కీలక రంగాలు ట్రంప్ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి ఉందని పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత వస్త్ర రత్న ఆభరణాల ఎగుమతులలో అమెరికా వాటా అధికంగా ఉంటుంది.

సుమారు 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో
కాబట్టి ఈ సుంకాల ప్రభావం ఈ రంగాలపై తీవ్రంగా ఉంటుందని, సుంకాలు పెరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని, అప్పుడు అమ్మకాలు తక్కువ అవుతాయని వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడిన భారత వస్త్ర, రత్నాలు-ఆభరణాల రంగాల్లో సుమారు 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ నిర్ణయాల వల్ల ఎగుమతులు తగ్గితే జరిగేదిదే
కొంతమంది సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ, చాలామంది విశ్లేషకులు కీలక రంగాలు కుదేలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఎగుమతులు తగ్గితే, ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల తొలగింపులు నష్టాల్లో ఉన్న సంస్థలను మూసివేయడం వంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్న ఆభరణాల రంగాలలో రెండు నుండి మూడు లక్షల మందిని తొలగిస్తారని ఒక అంచనా.
వస్త్ర పరిశ్రమల్లో లక్ష ఉద్యోగాలకు ముప్పు
ఇక కొత్త నియామకాలు కూడా తగ్గుతాయని, ఫలితంగా లక్షలాది మంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలాచోట్ల తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బంది పైన కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్ లు ఇదే విధంగా ఆరు నెలల పాటు కొనసాగితే వస్త్ర పరిశ్రమల్లో లక్ష ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు.
రత్నాల హబ్ లలో ఉద్యోగులకు ముప్పు
ఇక సూరత్, ముంబైలోని SEEPZ వంటి రత్నాల హబ్ లలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ప్రమాదాన్ని ఎదుర్కొంటారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు చాలా కంపెనీలు ఉద్యోగుల తీసివేతలు మొదలు పెట్టినట్టు ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్త నియామకాలను కూడా నిలిపివేసినట్టు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications