వడ్డీ వ్యాపారి టార్చర్, ముగ్గురు బలి, జిల్లా కలెక్టర్ కార్యాలయం సీజ్: తమిళ సంఘాల దెబ్బతో !
వడ్డీ వ్యాపారి వేధింపులు, పోలీసు ఇన్స్ పెక్టర్ బెదిరింపుల కారణంగా సోమవారం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిప్పంటించుకున్న కుటుంబంలోని ముగ్గురు మరణించారు.
చెన్నై: వడ్డీ వ్యాపారి వేధింపులు, పోలీసు ఇన్స్ పెక్టర్ బెదిరింపుల కారణంగా సోమవారం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిప్పంటించుకున్న కుటుంబంలోని ముగ్గురు మరణించారు. ఇంటి యజమాని ఎస్సక్కిముత్తు (30) 80 శాతం కాలిపోయి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
వడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి వేధిస్తున్నారని, అచ్చన్న పుత్తూరు ఇన్ సెక్టర్ బెదిరిస్తున్నారని తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరుకు ఫిర్యాదు చెయ్యడానికి ఆయన కార్యాలయానికి వెళ్లిన ఎస్సక్కిముత్తు తన భార్య సుబ్బలక్ష్మి, కుమార్తెలు శరణ్య (5), భరణ్య (18 నెలలు) మీద కిరోసిన్ పోసి అతను పోసుకుని నిప్పంటించుకున్నాడు.
తీవ్రగాయాలైన సుబ్బలక్ష్మి, శరణ్య, భరణ్య ఆసుపత్రిలో మరణించారు. ఎస్సక్కిముత్తు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అసలు, వడ్డీ చెల్లించినా మళ్లీ వడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి, పోలీస్ ఇన్స్ పెక్టర్ బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆరుసార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఎస్సక్కిముత్తు సోదరుడు గోపి ఆరోపించాడు.
మా మీదే ఫిర్యాదు చేస్తారా, మీ అంతు చూస్తానని ఇన్స్ పెక్టర్ హెచ్చరించాడని, ఆదుకునేవారు లేక గత్యంతరం లేని పరిస్థితిల్లో తన సోదరుడు ఎస్సక్కిముత్తు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని గోపీ బోరున విలపించాడు.
వడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి పరారైయ్యిందని, ఇన్స్ పెక్టర్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం పలు తమిళ సంఘాలు కలిసి తిరునల్వేలీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేస్తున్నారు. మృతుల కుటుంబానికి ఇకనైనా న్యాయం చెయ్యాలని తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.