మమతకు షాక్: టీఎంసీకి కీలక నేత ముకుల్ గుడ్బై, బీజేపీలోకే..?
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ముకుల్ రాయ్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభ స్థానంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. రాజీనామాకు కారణాలను మాత్రం మరో ఐదు రోజుల్లో దుర్గా పూజ ముగిసిన తర్వాత చెబుతానని వెల్లడించారు. అప్పుడే తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పారు.
ముకుల్ రాయ్ నెలరోజుల క్రితం భారతీయ జనతా పార్టీ నేతలను కలిశారు. వాళ్లని కలిసిన కొన్ని రోజులకే రాజీనామా చేయడం గమనార్హం. కాగా, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు రాయ్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
2015లో శారద చిట్ఫండ్ కుంభకోణంలో రాయ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను ఇటీవలే టీఎంసీ ఉపాధ్యక్షుడి హోదా, త్రిపుర టీఎంసీ ఇంఛార్జీ బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా, ముకుల్ రాజీనామా చేయడంతో పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు.