పన్నీరుకు దెబ్బ: శశికళ బంధించలేదని చెప్పిన ఎమ్మెల్యేలు
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారనే పిటిషన్ పైన సోమవారం నాడు మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారనే పిటిషన్ పైన సోమవారం నాడు మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు.
రిజర్వ్లో తీర్పు
వాంగూల్మాన్ని పరిశీలించిన కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ నాలుగు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఎమ్మెల్యేల వాంగ్మూలం
ఈ పిటిషన్ పైన కోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల నుంచి వాంగ్మూలాన్ని సేకరించాలని తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో గోల్డెన్ బే రిసార్ట్స్లో ఉంటున్నఎమ్మెల్యేల నుంచి పోలీసులు నిన్న వాంగ్మూలం సేకరించారు.
ఒత్తిడి తెచ్చారా?
ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారా? ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అని పోలీసులు ఎమ్మెల్యేలను విచారించి వివరాలు సేకరించారు.
పన్నీరుకు ఝలక్.. స్వచ్చంధంగానే..
పోలీసులు సేకరించిన వివరాలను చూస్తే పన్నీరు సెల్వంకు షాక్ అనే చెప్పవచ్చు. రిసార్టులో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా స్వచ్చంధంగానే అక్కడ ఉన్నట్లుగా తమతో చెప్పారని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఇది పన్నీరు వర్గం ఆశల పైన నీళ్లు చల్లడమే. అంతేకాదు, అక్రమంగా నిర్బంధించారని స్వయంగా పన్నీరు కూడా చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు అవాస్తవం అని తేలుతున్నాయని అంటున్నారు.