ఐఎస్ ఆదేశాలు: ఢిల్లీ, ముంబైపై ఉగ్రవాదుల కన్ను
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) భారత విభాగమైన ‘అన్సర్-యుత్ తాహిద్ ఫి బిలాల్ అల్-హింద్'కు చెందిన ఇద్దరు అగ్రనేతలకు ఢిల్లీ, ముంబైలపై కన్నేసి ఉంచాల్సిందిగా విదేశీ నేతల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ రెండు నగరాల్లో ఉగ్రదాడుల కోసం సరైన లక్ష్యాలకు సంబంధించిన సమాచారం సేకరించాలని కోరినట్లు నిఘా సంస్థలు బుధవారం వెల్లడించాయి.
గణతంత్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో భాగంగా 15మందికి పైగా ఐఎస్ అనుమానితుల్ని అరెస్టు చేశారు. సాధ్యమైనప్పుడు ఉగ్రదాడుల్ని చేపట్టేందుకు కొత్త నియామకాల కోసం యువతను ఆకర్షించాల్సిందిగా నిర్వాహకులు ఆదేశించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

భారత్లో ఐఎస్ అధినేతగా భావిస్తున్న ముంబ్రాకు చెందిన ముదబ్బీర్ ముస్తాఖ్ షేక్(33) ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అరెస్టు చేసిన రెండోస్థాయి నేత ఖలీద్ అహ్మద్ అలీ అలియాస్ రిజ్వాన్(20) మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కస్టడీలో ఉన్నారు.
వీరిలో ఒకరి ఇంటి నుంచి బాంబులు తయారుచేసే సర్క్యూట్ను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉగ్రదాడుల కోసం రంగం సిద్ధం చేసుకుంటుండగా అరెస్టులు జరిగినట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు.












Click it and Unblock the Notifications