33ఏళ్ల తర్వాత ఫిజీలో ప్రధాని.. భారీ సాయం (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఆస్టేలియా పర్యటన ముగించుకుని భారతీయ వాయసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఫిజీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఫిజీ పార్లమెంట్లో ప్రసంగించారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్కు ఫిజీ అత్యంత ప్రాధాన్యమైన మిత్ర దేశం. నా పర్యటన ద్వారా గత సంబంధాలు మరింత బలపడనున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పు, భద్రతామండలి విస్తరణ వంటి తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
అదేవిధంగా రక్షణరంగం, భద్రతా అంశాల్లో సహకారం అవసరమని అన్నారు. ఇరు దేశాల్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవగాహన ఉండాలన్నారు. గత సంవత్సరం భారత్ చేపట్టిన మార్స్ మిషన్ లక్ష్యసాధింపులో భారత శాస్త్రవేత్తలకు సహకరించినందుకు ధన్యవాదాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
అనంతరం ఫిజీ ప్రధాని బైనీమర్మ మాట్లాడుతూ పార్లమెంట్ లైబ్రరీ నిర్మాణం, వాణిజ్య అభివృద్ధికి, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తున్న భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. గత 33 సంవత్సరాల్లో ఒక భారత ప్రధాని ఫిజీని సందర్శించడం ఇదే తొలిసారి. తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని ఆయన పేర్కొన్నారు.
కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షం పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగానికి హాజరు కాలేదు. రాబోయే కాలంలో భారత్ - ఫిజీల మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం 12 ఫసిఫిక్ దేశాల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఫిజీ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిజీ పర్యటన సందర్భంగా మోడీ భారీగా ఆర్ధిక సాయం ప్రకటించారు. ఫిజీలో విద్యుత్ ప్లాంట్ కోసం 7 కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు.
అనంతరం ఫిజి నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఫిజీ ప్రధాని బైనీమర్మ ఏర్పాటు చేసిన విందుకి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.