జార్ఖండ్ స్కూల్లో విద్యార్ధులకు దొంగతనం ట్రైనింగ్, విస్తుపోయిన పోలీసులు
రాంచీ: విద్యార్ధులకు మంచి చదువు చెప్పి ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఉత్తమ జీవితం గడిపేందుకు శిక్షణ ఇవ్వాల్సిన స్కూలు దొంగతనాలను చేయడంలో శిక్షణ ఇస్తుంది. ఒక దొంగతనం కేసులో పోలీసులు వెళ్లి విచారిస్తే, విస్తుపోయే నిజాలు తెలిశాయి.
పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోగల సాహెబ్గంజ్ ప్రాంతంలో ఉన్న ఆ స్కూలు చిన్నపిల్లలకు దొంగతనం నేర్పించటమే కాదు, ట్రైనింగ్ పీరియడ్లో నెలకు ఒక్కో విద్యార్థికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉపకార వేతనం కూడా ఇస్తున్నారు.
ఇక్కడ నేర్పించే దొంగతనం విద్యలో ప్రత్యేక కోర్సు కూడా ఉంది. అది ఏంటంటే ఖరీదైన సెల్ఫోన్లను దొంగిలించటం ఎలా? దోపిడీ కేసులో పాఠశాలపై దాడిచేసిన సుఖ్దేవ్నగర్ పోలీసులు ఈ స్కూలు ప్రత్యేకతను చూసి షాక్కు గురయ్యారు.
ఐదుగురు పాఠశాల నిర్వాహకులు, కొంతమంది చిన్నారులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ స్కూల్లో చదివే చిన్నారులంతా సాహెబ్గంజ్ ప్రాంతానికి చెందినవారని, సెల్ఫోన్ల మార్కెట్లో దొంగతనాలు చేయటంపై వారికి శిక్షణ ఇస్తున్నారని పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.