భారతీయ సంగీతం ముద్దు బిడ్డను కోల్పోయిందన్న జూనియర్ ఎన్టీఆర్ .. ఇది చీకటి రోజన్న మెగాస్టార్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచి కానరాని లోకాలకు చేరిపోయారు. బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. సినీ ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ , రాం చరణ్ , మెగాస్టార్ చిరంజీవి , మోహన్ బాబు తదితరులు ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు .
ఎస్పీ బాలుకి ప్రముఖుల నివాళి .. ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు తెలుగురాష్ట్రాల సీఎంలు
బాలు మృతి పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు.తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది.భారతీయ సంగీత ప్రపంచం తన ముద్దుబిడ్డను కోల్పోయింది. 16 భాషల్లో 40 వేల పాటలకు పైగా జీవం పోసిన గాన గంధర్వ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది . ఈ భువిలో సంగీతం ఉన్నంతకాలం మీరు అమరులే అంటూ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు.
సంగీత ప్రపంచానికి చీకటి రోజు .. మెగాస్టార్ చిరంజీవి
గాన గంధర్వుడు ఎస్పీ బాలు మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . సంగీత ప్రపంచానికి చీకటి రోజని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సోషల్ మీడియా ద్వారా బాలుకు నివాళులర్పించిన చిరంజీవి ఎస్పీ బాలు తనకు ఎన్నో పాటలు పాడారని, తన సక్సెస్లో ఆయన గాత్రానిది కూడా ప్రధాన పాత్ర అని గుర్తు చేసుకున్నారు . ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన సంగీత ప్రపంచానికి ఇది చీకటి రోజు. సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఓ శకం ముగిసింది అంటూ పేర్కొన్నారు . తన విజయం వెనుక ఆయన పాత్ర కూడా ఉందని, ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి అని ఆయన అన్నారు .
ఎస్పీ బాలు ధృవతార అన్న చిరంజీవి
ఘంటసాల తర్వాత ఎవరు ఉన్నారని లోకం ఎదురు చూస్తున్న సమయంలో ధృవతార ఎస్పీ బాలు రూపంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిందన్నారు . దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మందిని దశాబ్దాల పాటు తన గాత్రంతో అలరించారు . ఆయనలా మరొకరు లేరు ఆయనే మళ్ళీ పుట్టి ఆ లోటును పూరించాలని చిరంజీవి పేర్కొన్నారు . ఆయనను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్న చిరంజీవి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన ట్విట్టర్లో పేర్కొన్నారు
స్పందించిన రాం చరణ్ .. ఇది నిజంగా షాక్ అంటూ
బాలసుబ్రమణ్యం మృతిపై రామ్ చరణ్ స్పందించారు . బాల సుబ్రహ్మణ్యం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మన బాలసుబ్రమణ్యం గారు ఇక లేరు అని తెలిసి నేను షాక్ కి గురయ్యాను. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
దేవుళ్ళ పాటలు పాడి దేవుడ్నే మెప్పించిన గాయకుడు : మోహన్ బాబు
ఎస్పీ బాలసుబ్రమణ్యం తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు సినీ నటుడు మోహన్ బాబు. ఎస్పీ బాలసుబ్రమణ్యం తనకు అత్యంత ఆత్మీయుడు అని ఆప్త మిత్రుడని పేర్కొన్నారు. తామిద్దరూ శ్రీకాళహస్తిలో కొన్నాళ్ళు చదువుకున్నాం అంటూ ఫ్రెండ్స్ గా ఉన్నాం అంటూ ఆయన వారి అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. దేవుళ్ల పాటలు పాడి దేవుడనే మెప్పించిన గానగంధర్వుడు అంటూ కొనియాడారు. ఏ దేవుడు పాట పాడితే ఆ దేవుడు మన ముందు ప్రత్యక్షమైనట్టే ఉంటుందంటూ పేర్కొన్న మోహన్ బాబు అలాంటి వ్యక్తిని కోల్పోవడం యావత్ సినిమా ఇండస్ట్రీకే కాదు యావత్ దేశానికి ఎంతో బాధాకరం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన పాట ఎప్పటికీ వినిపిస్తుంది అన్న మోహన్ బాబు
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు పేర్కొన్న మోహన్ బాబు తన చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది అంటూ, తన హృదయం లో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు . తను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు బాల సుబ్రహ్మణ్యం దగ్గర 100 రూపాయలు తీసుకున్నానని ఇప్పటికీ ఇవ్వలేదని , పలు సందర్భాల్లో బాలు తనను సరదాగా ఆటపట్టించే వాడంటూ గుర్తు చేసుకున్నారు. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని పేర్కొన్న మోహన్ బాబు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను అన్నారు . ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు.