మమతపై దాడి వ్యవహారం- ఈసీ చర్యలకు తృణమూల్, దర్యాప్తుకు బీజేపీ ఫిర్యాదులు
పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీపై నిన్న నందిగ్రామ్లో దాడి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం అక్కడి ఎన్నికల్లో కాక రేపుతోంది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. దీంతో మమతపై దాడి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ, అసలేం జరిగిందో తేల్చాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి.
నందిగ్రామ్లో తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి చేయడం ద్వారా ఆమెను అంతమొందించే కుట్ర జరిగిందని టీఎంసీ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులే పేర్కొంది. అర్దాంతరంగా ఎన్నికల సంఘం డీజీపీని మార్చడం మమతా బెనర్జీ ప్రాణహానికి కారణమైందని కూడా తృణమూల్ ఎన్నికల సంఘాన్ని ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకన్న 24 గంటల్లోనే మమతపై దాడి జరిగిందని తృణమూల్ ఆరోపిస్తోంది. డీజీపీపై బీజేపీ ఫిర్యాదులకూ, మమతపై దాడి జరిగినప్పుడు అక్కడ పోలీసులు లేక పోవడానికీ మధ్య సంబంధముందని కూడా టీఎంసీ ఆరోపణలు చేసింది. చుట్టుపక్కల పట్టణాల నుంచి నందిగ్రామ్కు అసాంఘిక శక్తుల్ని బీజేపీ తరలించిందని విమర్శించింది.
ఈసీకి తృణమూల్ ఫిర్యాదుపై బీజేపీ కూడా స్పందించింది. నందిగ్రామ్లో తనను కొందరు తోసేయడం వల్ల గాయాలయ్యాయని సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవని, వాటిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. భారీ భద్రత మధ్య మమతపై దాడి జరగడం అసాధ్యమని బీజేపీ తమ ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవాలు బయటపడేందుకు వీలుగా ఘటన జరిగినప్పుడు వీడియో ఫుటేజ్ను బయటపెట్టాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. మమతపై దాడి ఘటనపై ఉన్నతస్ధాయి దర్యాప్తు జరిపించాలని బీజేపీ కోరింది.