త్రిపుర సీఎం వ్యాఖ్యలపై డయానా హెడెన్ దిమ్మతిరిగే కౌంటర్, అందుకే అలా.. సారీ చెప్పిన బిప్లవ్
Recommended Video
న్యూఢిల్లీ/అగర్తాలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ వ్యాఖ్యలపై మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్ స్పందించారు. తాను ఛామనచాయ రంగులో ఉన్నందుకు, భారతీయురాలైనందుకు గర్వంగా భావిస్తున్నానని గట్టి కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు, తన వ్యాఖ్యలపై సీఎం బిప్లవ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. చేనేత పరిశ్రమ బాగా మార్కెట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో తాను మాట్లాడానని, తన వ్యాఖ్యలు బాధించినా, ప్రతిష్ఠకు భంగం కలిగించినా అందుకు క్షంతవ్యుడనని, తన అమ్మను గౌరవించినట్లే మహిళలందర్నీ నేను గౌరవిస్తానని చెప్పారు.
త్రిపుర సీఎం ఏమన్నారంటే?
గురువారం చేనేత - హస్త కళల కార్యశాలలో సీఎం బిప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. డయానా హెడెన్కు అసలు ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పూర్వం భారతీయ మహిళలు సౌందర్య సాధనాలను, షాంపూలను ఉపయోగించలేదని, మట్టి రుద్దుకొని స్నానం చేసేవారని, మెంతి నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకునేవారని, అందాల పోటీ నిర్వాహకుల మాఫియా మన దేశంలోకి చొచ్చుకు వచ్చిందని, ఇప్పుడు ఏ మూల చూసినా బ్యూటీ పార్లర్ కనిపిస్తోందన్నారు. అందాల పోటీల్లో కొందరికి ప్రత్యేక వస్త్రాలు ధరింపచేసి ర్యాంపుపై నడుస్తారన్నారు.
డయానా హెడెన్కు ఎవరిచ్చారు?
వాళ్లకు సర్టిఫికేట్స్ ఇచ్చేవారు అందర అంతర్జాతీయ టెక్స్టైల్స్ మాఫియావారేని, అవార్డు ఎవరికవ్వాలో వారు ముందే నిర్ణయిస్తారని, భారతీయ మహిళలకు ప్రతిరూపమైన ఐశ్వర్యా రాయ్కు ప్రపంచ సుందరి కిరీటం ఇచ్చారంటే అర్థం ఉందని, కానీ డయానా హెడెన్కు ఏం చూసి ఆ టైటిల్ ఇచ్చారో అర్థం కావడం లేదని బిప్లవ్ కుమార్ అన్నారు. మనవాళ్లు ప్రపంచ సందరి, విశ్వసుందరి కిరీటాలు దక్కించుకున్నప్పుడు అంతర్జాతీయ సంస్థలు మన దేశంలోకి చొచ్చుకు వచ్చాయన్నారు. అయితే ఆయన డయానాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టారు
బిప్లవ్ కుమార్ దేవ్ తనపై చేసిన వ్యాఖ్యలపై డయానా హెడెన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, చామనఛాయ ఉన్నందుకు గర్వపడాల్సింది పోయి, తక్కువచేసి మాట్లాడటం బాధించిందన్నారు. తెల్లని చర్మ రంగుకు ప్రాధాన్యమిచ్చే సంకుచిత మనస్తత్వంపై తాను చిన్నప్పట్నుంచే పోరాడుతున్నట్లు చెబుతూ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
అభినందించకుండా విమర్శలా?
తాను ప్రపంచ సుందరి టైటిల్ను గెలుచుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత దీని ద్వారా తెలుస్తోందని, భారతీయ చామనఛాయ ఔన్నత్యాన్ని తాను ప్రపంచానికి చాటితే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరమని డయానా హెడెన్ అన్నారు. ప్రపంచస్థాయి అందాల పోటీలో నెగ్గి, అత్యంత గౌరవప్రదమైన, ప్రతిష్ఠతో కూడిన టైటిల్నూ, ప్రశంసలను దేశానికి తీసుకొస్తే అభినందించకుండా విమర్శించడం ఏమిటన్నారు.
ఐశ్వర్యరాయ్తో పోల్చారు సరే
బిప్లవ్ కుమార్ దేవ్ తనను ఐశ్వర్యరాయ్తో పోల్చారని, అంతకుముందు అదే టైటిల్ సాధించిన ప్రియాంకా చోప్రాతోగానీ, ఇటీవల ఆ కిరీటం పొందిన మానుషి చిల్లర్తోగానీ ఎందుకు పోల్చలేదని డయానా హెడెన్ ప్రశ్నించారు. భారతీయులముగా చామనఛాయ ఉన్నందుకు గర్వపడాలని చెప్పారు. సమాజంలో ఉన్న చర్మవర్ణ వివక్ష కారణంగా ఆత్మన్యూనతకు గురవుతూ వచ్చానని, దానిపై పోరాడాల్సి వచ్చిందన్నారు. తన మనోభావాలకు విరుద్ధమైన ఓ ఫెయిర్నెస్ క్రీమ్ ప్రచార అవకాశాన్ని తోసిపుచ్చానని చెప్పారు. భారతీయ చామనఛాయను ప్రపంచమంతా అభినందిస్తోందని, మనమూ అభినందించడం నేర్చుకోవాలన్నారు. కాగా, బిప్లవ్ కుమార్ ఆ తర్వాత తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.