ఎన్నికల వేళ: సీఎం బ్యాంక్ బ్యాలెన్స్ రూ.2,410!: త్రిపురలో పరిస్థితి ఎలావుంది?
ధన్పూర్: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆస్తుల అంశం చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా దేశంలోనే అత్యంత పేద సీఎం ఈయనే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఆయనకు నిజాయితీపరుడిగా మంచి పేరుంది.
ఇక మాణిక్ సర్కార్ బ్యాంక్ బ్యాలెన్స్ పరిశీలించినట్లయితే రూ.2,410 మాత్రమే ఉండటం విశేషం. ఇంకా తన చేతిలో ఖర్చుల కోసం రూ.1,520 మాత్రమే ఉన్నాయని మాణిక్ సర్కార్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. దీంతో ఆయనకు ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్న్ చేసే అవకాశం కూడా రాలేదు.
వరుస విజయాలు.. ఐదోసారి..
ధన్పూర్ నుంచి 1998 నుంచి సీపీఎం పార్టీ తరపున మాణిక్ సర్కార్ వరుస విజయాలను అందుకుంటున్నారు. అంతేగాక, వచ్చే ఎన్నికల్లో గెలిచి ఐదోసారి త్రిపుర ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. కాగా, త్రిపుర రాజధాని అగర్తాలకు సర్కార్ నియోజకవర్గం ధన్పూర్ 65కి.మీల దూరంలో ఉంది. రాజధాని నుంచి ఈ నియోజకవర్గానికి ఒకే వరుస రోడ్డు ఉంది. రబ్బర్ ప్లాంటేషన్, పంట పొలాలు రోడ్డుకిరువైపులా ఉంటాయి.
మాణిక్.. మంచి నాయకుడు
మాణిక్ సర్కార్ మంచి నాయకుడని, గత 20ఏళ్లుగా రాష్ట్రాన్ని శాంతిభద్రతలతో నడిపిస్తున్నారని ధన్పూర్ నియోజకవర్గానికి చెందిన అబుల్ కలామ్ అనే 60ఏళ్ల రైతు చెప్పుకొచ్చాడు. మనం అతని ఇంటి ఆవరణలో ఆయనతో కలిసి నడవగలిగే అవకాశం ఉందని తెలిపాడు.
మాణిక్ చుట్టూ అవినీతి పరులే..
కాగా, మాణిక్ సర్కార్ మంచి ముఖ్యమంత్రే కానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్లంతా అవినీతిపరులేనని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వారిని కట్టడి చేయడంలో మాణిక్ సర్కార్ కొంత విఫలమయ్యారని వారంటున్నారు. మాణిక్ సర్కార్ చేస్తున్న మంచి పనులను ఆయన చుట్టూ ఉన్న అవినీతిపరులు సక్రమంగా అమలు కానీయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేగాక, విద్యా, ఉద్యోగ కల్పన ప్రధాన సమస్యలుగా ఉన్నాయని చెబుతున్నారు. రవాణా కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని అంటున్నారు. అయితే, మాణిక్ సర్కార్ ప్రవేశపెట్టిన 30 ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని మరికొందరు అంటున్నారు.
తెల్ల చొక్కా కింద నల్ల మచ్చలు
ఇది ఇలా ఉండగా, ఇటీవల సోనాముర నియోజకవర్గం(మాణిక్ సర్కార్ పొరుగు నియోజకవర్గం)లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి తెల్లచొక్కా కింద నల్ల మచ్చలు కూడా ఉన్నాయంటూ ప్రధాని మోడీ ఆరోపించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అధిక వేతనాలు అందుతుండగా అతి తక్కువ వేతనాలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సవ్యంగా వినియోగంచడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పేదలను దోచుకుంటున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఖర్చుచేస్తున్న సొమ్ములో 80 శాతం కేంద్రం ఇస్తున్నదేనని పేర్కొన్నారు.
మాణిక్యం వద్దు.. వజ్రమే’.. మోడీ చెక్ పెట్టేనా..?
ఈ సందర్భంగా ‘మార్పు తెద్దాం.. మాతో రండి' అన్న బీజేపీ నినాదాన్ని మోడీ ఉటంకించారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా సీపీఎం పాలన సాగుతుండగా అందులో 20 ఏళ్లనుంచీ మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును శ్లేషార్థంలో ప్రయోగిస్తూ.. ‘ఇప్పటిదాకా మాణిక్యం ధరించాం. ఇక ‘హీరా' (వజ్రం)కు మారుదాం' అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘హైవే, ఐ-వే, రోడ్లు, ఎయిర్-వే' పదాల్లోని తొలి అక్షరాలను కలిపి ‘హీరా'గా అభివర్ణించారు మోడీ. తాను పేర్కొన్న మార్పు దిశగా త్రిపురలో ‘వాణిజ్యం, పర్యాటకం, నైపుణ్య శిక్షణ' పేరిట త్రిముఖ పథకం అమలు చేస్తామని ప్రధాని వివరించారు. కాగా, ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగివున్న మాణిక్ సర్కార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సంచలనం సృష్టిస్తారా? లేక బీజేపీకి అవకాశమిస్తారా? అనేది ఎన్నికల అనంతరమే తేలనుంది.