మండుతున్న త్రిపుర: రెండు వర్గాల మధ్య దాడులు-ప్రతిదాడులు: కాళీ ఆలయం ధ్వంసం
అగర్తల: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వర్గానికి చెందిన వారిపై దాడులు కొనసాగుతున్నాయి. భౌతికదాడులకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. వారి ఇళ్లు, దుకాణాలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తోన్నారు. ప్రార్థనా మందిరాలపైనా దాడులు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చినస్పటికీ.. పోలీసులు తోసిపుచ్చారు. వారి దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
కాళీ విగ్రహం ధ్వంసం..
తాజాగా- గుర్తు తెలియని వ్యక్తులు కాళికా అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి నిప్పు అంటించారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో కొందరు గాయపడ్డారు. ఉనకోటిలోని కైలా షహర్లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
బంగ్లాదేశ్ దాడులకు ప్రతీకారంగా..
ఈ దాడులు-ప్రతిదాడులపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. త్రిపురకు ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్లో హిందువులకు చెందిన వారి ఆస్తులు, ప్రార్థనా మందిరాలపై దాడులు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. దేవీ నవరాత్రుల సమయంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అమ్మవారి దసరా మండపాలను స్థానికులు కొందరు ధ్వంసం చేశారు. దాడులకు పాల్పడ్డారు.
పలు చోట్ల 144 సెక్షన్లు
దీనికి ప్రతీకారంగా- త్రిపురలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. త్రిపురలో ఒక వర్గంపై చోటు చేసుకుంటోన్న ఈ హింసాత్మక దాడుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల పైనా దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 12 మంది పోలీసులు గాయపడినట్లు చెబుతున్నారు. ఈ హింసాత్మక పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధించారు.
విచారణకు ఆదేశం..
గత కొన్ని రోజులుగా, వీహెచ్పీ, హిందూ జాగరణ వేదిక వంటి సంస్థలు అగర్తలతో పాటు ఇతర జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో నిరసనలు నిర్వహించాయని, ఆ సమయంలో- ఈ దాడులు సంభవించాయనే విమర్శలు ఉన్నాయి. కృష్ణా సాగర్, ధర్మానగర్, పణిసాగర్, చంద్రాపూర్ లలోనూ ఇలాంటి దాడుల ఘటనలు నమోదయ్యాయి. నార్త్ త్రిపుర జిల్లాలోని పణిసాగర్లో మసీదుపై దాడులు చోటు చేసుకున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై తాము వెంటనే స్పందించామని ప్రభుత్వం చెబుతోంది.
నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు..
దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని త్రిపుర సాంస్కృతిక శాఖ మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. ఈ వీడియో సందేశాన్ని పంపించారు. ఈ పరిణామాలన్నింటిపైనా హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్ 10వ తేదీలోగా నివేదిక అందజేయాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఎలాంటి తక్షణ చర్యలను తీసుకున్నారో వివరించాలని సూచించింది.
Recommended Video
ఉనకోటిలో 144 సెక్షన్
తాజాగా- ఉనకోటిలోని కైలా షహర్లో గుర్తు తెలియని వ్యక్తులు కాళికా అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి నిప్పు అంటించారు. మైనారిటీలపై కొనసాగుతున్న దాడులకు ప్రతీకారంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘర్షణల్లో కొందరు గాయపడ్డారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో 144 సెక్షన్ను విధించారు పోలీసులు.