ఏపీలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే -గ్లోబల్గా 9వ స్థానంలో భారత్ -ట్రూకాలర్ షాకింగ్ రిపోర్ట్
స్పామ్ కాల్స్ బెడదను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది మనం 5వ స్థానంలో నిలవగా, లాక్ డౌన్ దెబ్బకు కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కావడం, ఎక్కువ స్పామ్ కాల్స్ దేశీయంగానే ఉండటంతో భారత్ గ్లోబల్ ర్యాంకు కిందికి దిగింది. స్పామ్ కాల్స్ పై ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ఏటా విడుదల చేసే ''ట్రూకాలర్ ఇన్ సైట్స్ రిపోర్ట్ 2020''లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తెలగురాష్ట్రమైన ఏపీలోనూ స్పామ్ బెడద తీవ్రంగానే ఉన్నట్లు వెల్లడైంది.
RRR:వైసీపీకి మేకు -జగన్కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ
స్పామ్ కాల్స్ అంటే?
మొబైళ్ల వినియోగం, ఆన్ లైన్ మనీ ట్రాంజాక్షన్స్ పెరిగిన తర్వాత స్పామ్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మనకు అవసరం లేకపోయినా, మన ఇష్టాలతో సంబంధం లేకుండా మార్కెటింగ్ ప్రమోషన్స్ పేరిట మొబైల్ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తూ, తమ ప్రకటనలల్ని లేదా ఆఫర్లు ఇవంటూ చేసేవాటినే స్పామ్ కాల్స్ అంటారని, కొన్ని సార్లు ఇవి మెసేజ్ లేదా మెయిల్స్ రూపంలోనూ వస్తుంటాయన్నది విదితమే. ఆయా కస్టమర్ కేర్లు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వ్యవస్థలు మనకు చేసే స్పామ్ కాల్స్ ద్వారా అనేక సైబర్ నేరాలు కూడా జరుగుతుండటంతో వాటిని నిరోధించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మొబైల్ వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో టెక్, మొబైల్ కంపెనీలు జాగ్రత్తలు వహిస్తున్నా రకరకాల మార్గాల్లో ఫోన్ నంబర్లు, ఇతర డేటా బహిర్గతమవుతుండటంతో స్పామ్ కాల్స్ వస్తూనేఉంటాయి..
18 శాతం పెరిగిన స్పామ్ బెడద
స్పామ్ కాల్స్ కు సంబంధించి ట్రూకాలర్ అధ్యయన రిపోర్టు(ఇన్ సైట్స్ రిపోర్ట్ 2020)లో అత్యధిక స్పామ్ కాల్స్ అందుకుంటున్న దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది స్పామ్ కాల్స్ బెడద 18 శాతం మేర పెరిగినట్లు రిపోర్టులో తెలిపారు. 2020లో యూజర్లు మొత్తం 31.3 బిలియన్ల స్పామ్ కాల్స్ను మొబైల్ యూజర్లు అందుకున్నట్లు నివేదిక పేర్కొంది. అత్యధిక స్పామ్ కాల్స్ అందుకుంటున్న దేశాల జాబితాలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. ఆదేశంలో ఒక మొబైల్ యూజర్ కు సగటున నెలకు 50 స్పామ్ కాల్స్ వస్తున్నట్లు ట్రూకాలర్ తెలిపింది. బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో యుఎస్, హంగేరి, పోలాండ్, స్పెయిన్, ఇండోనేషియా, యుకె, ఉక్రెయిన్, ఇండియా, చిలీ దేశాలు నిలిచాయి. ఇక..
ఇండియాలో నెలకు 17 స్పామ్ కాల్స్
మార్కెటింగ్ ప్రమోషన్స్, ఆఫర్ల, లాటరీల పేరుతో భారతీయ మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే. ఈ ఏడాది, భారతీయ వినియోగదారులు నెలకు సగటున 16.8 స్పామ్ కాల్స్ అందుకున్నారని ట్రూకాలర్ నివేదిక స్పష్టం చేసింది. ఆఫర్లు, డేటా ప్లాన్ల ప్రమోషన్లలో భాగంగా మొబైల్ ఆపరేటర్ల నుండి యూజర్లు దాదాపు 52 శాతం స్పామ్ కాల్స్ వచ్చాయని, 34 శాతం మేర టెలిమార్కెటింగ్ కంపెనీల నుండి ప్రమోషనల్ కాల్స్, మిగతావి సర్వేలు, పొలిటికల్ కాల్స్ వంటి వాటిని యూజర్లు అందుకున్నారని తేలింది.
లాక్డౌన్తో కాస్త ఉపశమనం
భారత్ గతేడాది గ్లోబల్ గా టాప్ 5లో ఉండగా, ఈసారి లాక్ డౌన్ సమయంలో టెలీ మార్కెటర్లు పూర్తిస్థాయిలో పని చేయని కారణంగా 9వ స్థానానికి చేరింది. భారతీయ వినియోగదారులు అందుకున్న స్పామ్ కాల్స్ ఈఏడాది 34శాతం తగ్గాయని, మొత్తం స్పామ్ కాల్స్ లో 98.5శాతం దేశీయంగానే చోటుచేసుకోవడంతో గ్లోబల్ ర్యాంకు తగ్గిందని ట్రూకాలర్ తెలిపింది. కాగా,
గుజరాత్ టాప్.. ఏపీలోనూ ఎక్కువే
లాటరీ గెలుచుకున్నారనో, ఫలానా ఆఫర్ మీకోసం సిద్ధంగా ఉందనో రకరకాలుగా స్పామ్ కాల్స్, మెసేజ్ రిమైండర్లకు సంబంధించి ఇండియాలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ లో ఒక యూజర్ కు నెలకు సరాసరి 13.5 స్పామ్ కాల్స్ అందుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (13.2శాతం) ఉండగా, ఆంధ్రప్రదేశ్ (9.5 శాతం)మూడో స్థానంలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్ (9.5 శాతం), ఢిల్లీ (7.5 శాతం), కర్ణాటక (7.1 శాతం), మధ్యప్రదేశ్ (6.3శాతం), రాజస్థాన్ (5.9శాతం), తమిళనాడు (5.2శాతం), బీహార్ (4.4శాతం), కేరళ (4.4శాతం), పంజాబ్ (3.6శాతం), హర్యానా (2.5 శాతం), ఒడిశా(1.9శాతం, వెస్ట్ బెంగాల్ (1.7శాతం), అస్సాం(0.8శాతం, హిమాచల్ ప్రదేశ్ (0.6శాతం), జమ్మూకాశ్మీర్ లో ఒక యూజర్ సరాసరి నెలకు 0.4శాతం స్పామ్ కాల్స్ అందుకుంటున్నట్లు ట్రూకాలర్ ఇన్ సైట్స్ రిపోర్ట్ 2020 లో వెల్లడైంది.
అనాథ టాపర్ -ఐఐటీ సీటు వివాదంపై సుప్రీంకోర్టు కీలక సూచన -చిన్న క్లిక్తో అంతా తలకిందులు