డొనాల్డ్ ట్రంప్ చేయలేనిది.. ప్రధాని మోడీ చేసిచూపించారు: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
పాట్నా: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సాధ్యం కానిది.. మన ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీహార్ రాష్ట్రంలో గురువారం చివరి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్బంగాలో జరిగిన ఎన్నిక ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు నడ్డా.
ట్రంప్కు అసాధ్యం.. మోడీకి సాధ్యం..
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఫలితాలు వెలువడనున్నాయి. కరోనాను సరిగా కట్టడిచేయలేకపోయారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆరోపణలున్నాయి. తగిన సమయంలో నిర్ణయం తీసుకుని ప్రధాని మోడీ 130 కోట్ల మంది ప్రజలను కాపాడారు' అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అమెరికాలో కరోనా కట్టడే కీలక ప్రచారాస్త్రంగా డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. కాగా, గురువారంతో బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది.
సీఎం నితీష్ కుమార్ మరోసారి..?
నవంబర్ 7న చివరి విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత, ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ మరోసారి ఆ పీఠంపై కూర్చుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు మహా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ తన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కూడా ఎన్నికల అనంతరం కీలకంగా మారాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. వీరిద్దరు నేతలు కూడా నితీష్ కుమార్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.
కరోనా కట్టడిలో అమెరికా కంటే ఇండియా బెటర్
కాగా, దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండటం శుభపరిణామం. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 84 లక్షల మందికిపైగా కరోనా మహమ్మారి బారినపడ్డారు. లక్షా 20వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక అమెరికా విషయానికొస్తే.. అగ్రరాజ్యంలో కోటికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటికే రెండు లక్షలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. ట్రంప్ కరోనా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత భారీ నష్టం జరిగిందని ఇప్పటికే జో బైడెన్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.