ట్రంప్ ఎఫెక్ట్: కాశ్మీరీ అథ్లెట్లకు వీసా నిరాకరణ
భారత్పై ట్రంప్ ప్రభావం అప్పుడే కనిపించడం ప్రారంభమైంది. ఇద్దరు కాశ్మీరీ అథ్లెట్లకు అమెరికా ఎంబసీ వీసా నిరాకరించింది.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త వీసా విధానం ప్రభావం అప్పుడే భారత్పై పడడం ప్రారంభించింది. 'కొత్త పాలసీ' కారణంగా కాశ్మీర్ అథ్లెట్ ఇద్దరికి వీసా ఇచ్చేందుకు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ నిరాకరించింది.
కాశ్మీర్కు చెందిన 24 ఏళ్ల తన్వీర్ హసన్, ఆబిద్ ఖాన్లకు ఎంబసీ వీసా నిరాకరించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 25న న్యూయార్క్లో జరుగనున్న స్నో-షూ ఛాంపియన్షిప్లో వారు పాల్గొనవలసి ఉంది. సర్నాక్ లేక్లో జరగనున్న ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనాల్సిందిగా వరల్డ్ స్నో-షూ ఫెడరేషన్ నుంచి తన్వీర్కు ఆహ్వానం అందింది. దీంతో వీసా కోసం అతను గత శనివారంనాడు న్యూఢిల్లీకి వెళ్లారు.
వీసా కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును ఎంబసీ అధికారులు తోసిపుచ్చారని, దీనికి ముందు ఆరు నిమిషాలు తనను ఇంటర్వ్యూ చేశారని తన్వీర్ చెప్పారు. పూర్తి డాక్యుమెంట్లు తాను సమర్పించినప్పటికీ అమెరికా నూతన పాలసీ కారణంగా వీసా ఇవ్వలేమని తనను ఇంటర్వ్యూ చేసిన అధికారి చెప్పినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుత విధానం గురించి వివరంగా చెప్పేందుకు ఆ అధికారి నిరాకరించారని, అధికారులతో వాదన చేయడం కుదరని పని అని, దాంతో గత్యంతరం లేక ఎంబసీ కార్యాలయం నుంచి వెనుదిరిగి వచ్చానని తన్వీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీనగర్ నివాసి అయిన తన్వీర్ 2016లో ఇటలీలో జరిగిన వరల్డ్ స్నో ఛాంపియన్షిప్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు తరఫున కూడా ఆయన మంచు క్రీడల్లో పాల్గొన్నారు. గత ఆరు నెలలుగా న్యూయార్క్ స్నో-షూ ఛాంపియన్షిప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నానని, ఇందుకోసం మంచు విపరీతంగా ఉండే గుల్మార్గ్కు వారంలో రెండు రోజులు వెళ్లి ప్రాక్టీస్ చేస్తూ వచ్చానని తెలిపారు.
అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులను నిషేధిస్తూ డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కాశ్మీర్ అథ్లెట్లకు అమెరికా వీసా నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.