Weather: ఏపీలో మరో మూడురోజులు భారీ వర్షాలు, తెలంగాణలోనూ జోరు వానలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. మరికొద్ది రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలోని ఆదివారం తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
ఉత్తర ఛత్తీస్గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిశాలలో ఝర్సుగుడాకి పశ్చిమ వాయువ్య దిశగా 80 కి.మి దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఛత్తీస్గఢ్ ఇంకా, మధ్యప్రదేశ్ మీదగా ప్రయాణించి, బలహీనపడి తీవ్ర పీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజులపాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు
తెలంగాణలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం, బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొన్నది. ఇది సోమవారం ఉదయం ఉత్తర కోస్తా ఒడిశా వద్ద చాంద్బలీకి పశ్చిమ వాయవ్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.
Recommended Video
రాగల 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి, ఆ తరువాత 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.