పళని, పన్నీర్ కు తలనొప్పి: దినకరన్ జోరు, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో, శశికళ ఓకే!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ సిద్దం అయ్యాడు. డిసెంబర్ 21వ తేదీన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ అభ్యర్థి ఎంపిక విషయంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు తలనొప్పి ఎదురైయ్యింది.
శశికళ వర్గం క్లారిటీ!
చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) శశికళ నటరాజన్ వర్గం నేత టీటీవీ దినకరన్ పోటీచేస్తున్నారని ఆయన వర్గం సీనియర్ నేత ఎస్. అంబళగన్ మీడియాకు చెప్పారు. శశికళ నటరాజన్ అనుమతితోనే టీటీవీ దినకరన్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్నారని అంబళగన్ తెలిపారు.
అదే టోపీ గుర్తుతో మళ్లీ పోటీ!
ఆర్ కే నగర్ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సిన ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ టోపీ గుర్తు మీద పోటీ చేశారు. ప్రచార సమయంలో కోట్లాది రూపాయలు స్థానిక ఓటర్లకు పంచిపెట్టారని ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను రద్దు చేసింది.
చిన్నమ్మ శశికళ ఓకే
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో బుధవారం శశికళతో భేటీ అయిన టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల విషయం, ఐదు మంది తమ గ్రూప్ లోని ఎంపీలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గంలోకి జంప్ అయిన విషయంపై చర్చించారు.
ఓట్లు చీల్చాలని చిన్నమ్మ ప్లాన్!
శశికళతో భేటీ అయిన తరువాత టీటీవీ దినకరన్ చెన్నై బయలుదేరి వెళ్లారు. చెన్నై వెళ్లిన టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ అభవ్యర్థిగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నాడు. ఆర్ కే నగర్ లో అన్నాడీఎంకే పార్టీ ఓట్లు చీల్చడానికి మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు చేస్తున్నది.
పళని, పన్నీర్ కు తలనొప్పి!
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారంలో ఉన్న తమ పార్టీ అభ్యర్థి ఎంపికలో సతమతం అవుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి అనేక మంది నాయకులు ముందుకు రావడంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారు.