దినకరన్ తో ఎమ్మెల్యేల భేటీ, నేరుగా సీఎం ఇంటికి: ఏం జరుగుతోంది !
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ గురువారం తన ఇంటిలో రెండు గంటలకు పైగా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. దినకరన్ ఇంటి నుంచి ఆ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం పళనిసామి ఇంటికి వెళ్లారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ మళ్లీ రచ్చ రచ్చ చెయ్యడానికి సిద్దం అయ్యారా ? అంటే అవుననే సమాదానం వస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటిలోనే మకాం వేసిన దినకరన్ మళ్లీ రచ్చ రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అయ్యారని వెలుగు చూసింది.
గురువారం మద్యాహ్నం అన్నాడీఎంకే పార్టీకి చెందిన తన వర్గంలోని ఎమ్మెల్యేలతో దినకరన్ చర్చలు జరిపారు. తరువాత తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను దినకరన్ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ఇంటికి రాయభారం పంపించారు.

ఒంటరిగా ఉంటూనే
ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన తరువాత టీటీవీ దినకరన్ ఇంటిలోనే తిష్టవేసి తన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. కేసుల నుంచి తాను ఎలా బయటపడాలి అంటూ న్యాయవాదులతో చర్చించారు.

ఒక్క సారి రెచ్చిపోయి
తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాను అంటూ చాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ తరువాత తన స్వరం మార్చారు. తన వ్యక్తిగత ప్రయోజనాలకంటే అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమని మీడియాకు చెప్పారు.

నాకు శత్రువులు ఎవ్వరూ !
అన్నాడీఎంకే పార్టీలో తనకు శత్రువులు ఎవ్వరూలేరని, అందరూ మిత్రులే అని నీతులు చెప్పిన టీటీవీ దినకరన్ ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగడానికి సిద్దం అయ్యారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంటిలోనే ఎమ్మెల్యేలతో మీటింగ్
గురువారం మద్యాహ్నం తన వర్గంలోని ఎమ్మెల్యేలను ఇంటి దగ్గరకు పిలిపించుకున్న దినకరన్ రెండు గంటలకు పైగా చర్చించారు. తన గురించి ఎడప్పాడి పళనిసామితో సహ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు ? అని ఆరా తీశారు.

ఎందుకు ఎదురుతిరిగారు
ఒక్క సారిగా తన మీద పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఎదురుతిరిగారు అంటూ దినకరన్ వివరాలు సేకరించారు. మళ్లీ తనకు పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని ఆరా తీశారని సమాచారం.

వచ్చింది ఎవరంటే
టీటీవీ ఇంటి నుంచి నేరుగా సీఎం ఇంటికి అన్నాడీఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలు( దినకరన్ వర్గం) తంగ తమిళ సెల్వం, వెట్రివేల్ బయలుదేరి వెళ్లారు. మరో ఎమ్మెల్యే కదిరగామ తదితరులు దినకరన్ తో భేటీ అయినా వారు మాత్రం సీఎం పళనిసామి ఇంటి దగ్గరకు వెళ్లలేదు.

రాయభారం ఏమిటీ ?
టీటీవీ దినకరత్ భేటీ అయిన తరువాత ఎమ్మెల్యేలు తంగ తమిళ సెల్వం, వెట్రివేల్ ఎందుకు పళనిసామి ఇంటికి వెళ్లారు అనే విషయం అంతుపట్టడం లేదు. దినకరన్ వారితో ఏ మాట్లాడారు ? సీఎంతో రాయభారం ఎందుకు ? అంటూ మీడియా ఆరా తీసినా ఫలితం లేకపోయింది.

ఉల్లాసంగా, ఉత్సాహంగా దినకరన్
ఎమ్మెల్యేలతో భేటీ అయిన తరువాత దినకరన్ ఉత్సాహంగా ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద దినకరన్ మళ్లీ ఏదో ఒకటి చెయ్యడానికి ప్రతయ్నాలు చేస్తున్నారని సమాచారం. దినకరన్ ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యేలలో చీలక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి.












Click it and Unblock the Notifications