కమల్ హాసన్ వరుస ట్వీట్ల దాడి: జయలలితపై కసితోనే?
కమల్ హాసన్ వరుస ట్వీట్లతో శశికళ రాజకీయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయనకు జయలలితపై ఉన్న కోపం కారణంగానే ఆ పనిచేస్తున్నారా...
చెన్నై: జయలలిత మరణించిన తర్వాత తమిళ నటుడు కమల్ హాసన్ వరుస ట్వీట్లతో శశికళ వర్గంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్వీట్లు చేస్తూ జయలలితపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. జయలలితపై ఆగ్రహం కారణంగానే ఆయన ఆ పనిచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జయపై ఆయనకు ఎందుకు కోపమనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. బహుశా, విశ్వరూపం సినిమా విడుదల సమయంలో జయలలిత ప్రదర్శించిన వైఖరిపై కసితో ఆయన రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గిన తర్వాత కూడా ఆయన తన ట్వీట్ల దండకాన్ని ఆపడం లేదు.
జయలలిత మృతి, సుప్రీం తీర్పు, ముఖ్యమంత్రి ఎన్నిక పరిణామాల నేపథ్యంలో ఆయన సంచలనమైన ట్వీట్లు చేశారు. తాజాగా ఆయన మరోసారి తన ట్వీట్ల దూకుడు చూపించారు. విశ్వాస పళనిస్వామి గెలిచినప్పటికీ ఫలితాన్ని తాను అంగీకరించబోనని అన్నారు.
దోషిగా తేలిన శశికళ, ఆమె కుటుంబ సభ్యులంతా
దోషిగా తేలిన శశికళ, ఆమె కుటుంబసభ్యులు కలిసి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నిలబెట్టారని, ఆదో నేరస్తుల గుంపు అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. దివంగత సీఎం జయపై కూడా నేరారోపణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. విశ్వరూపం వివాదం నాటి పరిస్థితులను కమల్ ఇంకా మరిచిపోలేకనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జయలలిత తీరు పట్ల అప్పట్లో కమల్ హాసన్ తీవ్రంగా ప్రతిస్పందించారు
ఆ సమయంలో ఏం జరిగింది...
విశ్వరూపం సినిమా సమయంలో జయలలిత కమల్ హాసన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కమల్ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం సినిమాను విడుదల చేసిన రోజే టీవీల్లో ప్రసారం చేస్తారనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా డీటీహెచ్ హక్కులను ముందస్తుగానే అమ్మేశారు. దానివల్ల థియేటర్లో ఎవరూ సినిమా చూడరని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కమల్ హాసన్ ఒప్పందాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు పిర్యాదు చేశారు.
అప్పటికే కమల్ హాసన్పై జయలలితకు కోపం..
అప్పటికే జయలలితకు కమల్ హాసన్పై మండిపోతున్నారని సమాచారం. సినిమా శాటిలైట్ హక్కులను అన్నాడీఎంకేకు చెందిన ఛానల్కు ఇచ్చేందుకు కమల్ నిరాకరించడమే దానికి కారణమనేది చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో విశ్వరూపం సినిమాపై పలు ముస్లిం సంస్థలు అభ్యంతరం చెప్పుతూ ఆందోళనలకు దిగాయి. దీంతోవ్యవహారం రాజకీయం రంగు పులుముకుంది. దీంతో సినిమాను నిషేధిస్తూ జయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మద్రాసు కోర్టులో జయలలితకు ఊరట
కమల్ హాసన్ మద్రాసు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆయన ఊరట లభించింది. కానీ జయ ప్రభుత్వం దాన్ని తమిళనాడు హైకోర్టులో సవాల్ చేసింది. ఆ వివాదం కొన్ని రోజుల తర్వాత గానీ సమసిపోలేదు. పళని విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత కమల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమతుల్యంతో వ్యవహరించే రాజకీయ నాయకులంటే ప్రజలకు ఇష్టమని, అయితే తనతోపాటు ప్రజలు ఇప్పుడు కోపంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.