రాహుల్ విమర్శలపై స్పందించిన ట్విట్టర్-వివక్ష లేదని వెల్లడి, ఫాలోవర్స్ ఎందుకు తగ్గారంటే?
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ తాజాగా విమర్శల వర్షం కురిపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ట్విట్టర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న రాహుల్.. మైక్రో బ్లాగింగ్ సైట్ వివక్ష చూపుతోందని ఆరోపించారు. భారతదేశ ఆలోచనను నాశనం చేసే ప్రక్రియలో పావు కావొద్దంటూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కు రాసిన లేఖలో హెచ్చరించారు. దీనిపై ట్విట్టర్ స్పందించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ వెబ్ సైట్ పై విమర్శలు చేస్తూ రాసిన లేఖపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. తమ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎప్పుడూ మ్యానిపులేషన్, స్పామ్ కు వ్యతిరేకంగానే పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. పరాగ్ అగర్వాల్ వివరణను ట్విట్టర్ ప్రతినిధి మీడియాకు విడుదలచేశారు. ఇందులో తమ ప్లాట్ఫారమ్ మానిప్యులేషన్, స్పామ్లకు ట్విట్టర్ జీరో-టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉందన్నారు. తాము మెషిన్ లెర్నింగ్ టూల్స్తో వ్యూహాత్మకంగా, నైపుణ్యంతో స్పామ్, హానికరమైన ఆటోమేషన్తో పోరాడుతామని తెలిపారు. అలాగే ఆరోగ్యకరమైన సేవ, విశ్వసనీయ ఖాతాలను నిర్ధారించడానికి స్థిరమైన, కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా.. ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య హెచ్చుతగ్గులకు గురవుతుందని పేర్కొన్నారు.
అంతకుమిుందు రాహుల్ గాందీ తన లేఖలో తన ట్విట్టర్ ఖాతాను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ఎంపీ శశిధరూర్ ఖాతాలతో పోల్చి విశ్లేషించారు. 2021లో మొదటి ఏడు నెలలకు సగటున తన అనుచరులు 4 లక్షల మంది పెరిగారని, గత ఏడాది ఆగస్టులో తన ఖాతాను ఎనిమిది రోజుల పాటు సస్పెండ్ చేయడంతో వృద్ధి ఆగిపోయిందని ఆయన ట్విట్టర్ కు తెలిపారు.
సరిగ్గా ఈ నెలల్లోనే తాను ఢిల్లీలో అత్యాచార బాధితురాలి కుటుంబ దుస్థితిని లేవనెత్తానని, రైతులకు సంఘీభావంగా నిలబడి అనేక ఇతర మానవ హక్కుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడానని రాహుల్ తెలిపారు. తన గొంతు నొక్కమని ప్రభుత్వం ద్వారా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ట్విట్టర్ ఇండియాలోని వ్యక్తులు తనకు విశ్వసనీయంగా తెలియజేశారని రాహుల్ వెల్లడించారు. చట్టబద్ధమైన కారణం లేకుండా తన ఖాతా కొన్ని రోజులు బ్లాక్ చేశారని గుర్తుచేశారు.