84 ఏళ్ల బామ్మకు 30 నిమిషాల వ్యవధిలోనే రెండు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు... ఎందుకిలా జరిగిందంటే...
కోవిడ్ తొలి డోసు,రెండో డోసుకు మధ్య సాధారణంగా 8-12 వారాల గ్యాప్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కేరళలో 84 ఓ వృద్దురాలు 30 నిమిషాల వ్యవధిలోనే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. వైద్య సిబ్బంది పొరపాటుతో ఇలా జరిగింది. నిమిషాల వ్యవధిలోనే రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఆ వృద్దురాలి ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం కనిపించలేదు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.తందమ్మ పప్పు అనే వృద్దురాలు తన కొడుకుతో కలిసి వ్యాక్సినేషన్ కోసం ఆస్పత్రికి వచ్చారు. కాసేపటికి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుని... ఆస్పత్రి నుంచి బయటకొచ్చారు. తీరా చూసుకుంటే... తన కాళ్లకు చెప్పులు లేవు.వ్యాక్సినేషన్ గది వద్దే చెప్పులు మరిచిపోవడంతో... మళ్లీ లోపలికి వెళ్లారు. గది వద్ద తన కాళ్లకు చెప్పులు వేసుకుంటున్న సమయంలో ఓ మహిళా సిబ్బంది ఆమెను గది లోపలికి రమ్మని పిలిచారు.

ఆ వృద్దురాలు ఏదో చెప్పబోతుండగా.. అదేమీ పట్టించుకోకుండానే ఆమెను లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు.ఆ తర్వాత క్షణాల్లో ఆమెకు వ్యాక్సిన్ డోసు ఇచ్చారు.ఆ తర్వాత గానీ ఆమె మాట వినిపించుకోలేదు. అంతకు 30నిమిషాల ముందే తనకు వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చారని వృద్దురాలు చెప్పడంతో అవాక్కయ్యారు. గంట పాటు వృద్దురాలిని అబ్జర్వేషన్లో ఉంచారు.ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ప్రమాదమేమీ లేదని చెప్పి ఇంటికి పంపించారు. తాను నిక్షేపంగా ఉన్నానని ఆ వృద్దురాలు కూడా మీడియాతో చెప్పారు. కొద్ది నెలల క్రితం అలప్పుజా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
కరోనా కేసుల విషయానికొస్తే... కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు.శనివారం(సెప్టెంబర్ 18) కొత్తగా 19,325 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇవాళ పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.గడిచిన 24గంటల్లో మొత్తం 27,266 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కేరళలో మొత్తం రికవరీల సంఖ్య 42,83,963కు పెరిగింది.
గడిచిన 24గంటల్లో మరో 143 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 23,439కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24గంటల్లో మొత్తం 1,21,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా కేసులు నమోదయ్యాయి.మరో 281 మంది కరోనాతో మృతి చెందారు.ఇందులో కేరళ,మహారాష్ట్ర,కర్ణాటకల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 2.5కోట్ల వ్యాక్సినేషన్లతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ లెక్కన ఒక సెకనుకు దేశంలో 466 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరుగుతోంది.












Click it and Unblock the Notifications