కస్టడీలో యువకుడు మృతి: ఇద్దరు కేరళ పోలీసులకు మరణశిక్ష
తిరువనంతపురం: 23 ఏళ్ల యువకుడు కస్టడీలో మృతి చెందిన కేసులో ఇద్దరు పోలీసులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. తిరువనంతపురం పోలీస్ స్టేషన్లో 13 ఏళ్ల క్రితం కస్టడీలో ఉన్న యువకుడిని చిత్రహింసలకు గురి చేసి అతని మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఇద్దరు పోలీసులను కోర్టు నేరస్తులుగా తేల్చింది. వారికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం మరణశిక్ష విధించింది. ఇది అత్యంత అరుదైన కేసుల్లో అరుదైనదని, సివిల్ పోలీసు అధికారులైన జీతా కుమార్, శ్రీకుమార్లు ఈ శిక్షకు అర్హులని సీబీఐ జడ్జి కే నజర్ పేర్కొన్నారు. మృతుడి తల్లికి దోషులు చెరో రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.
నాడు పోలీసు కస్టడీలో చనిపోయిన యువకుడు ఉదయ్ కుమార్. ఈ కేసులో న్యాయం కోసం అతని 68 ఏళ్ల తల్లి ప్రభావతి అమ్మ 13 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఇప్పుడు న్యాయస్థానం దోషులకు శిక్ష విధించింది.
ఈ కేసులో మరో ముగ్గురికి కూడా న్యాయస్థానం మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. హరిదాసు, అజిత్ కుమార్, ఈకే సాబులు ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేసినందుకు వారికి మూడేళ్ల చొప్పున శిక్ష విధించారు.