గన్ గురిపెట్టి ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
బదౌన్: ఇటీవల కాలంలో దేశంలో అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఠక్కున చెప్పే సమాధానం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు మైనర్ బాలికలను అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది.
యూపీలోని బదౌన్ ఏరియాలోని జరీఫ్ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. వరుసకు అక్కాచెల్లెలైన ఇద్దరు మైనర్ బాలికలను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్పీ సౌమిత్రి యాదవ్ గురువారం వెల్లడించారు.
వివరాలిలా ఉన్నాయి. జరీఫ్ నగర్కు చెందిన ఇద్దరు మైనర్ బాలికల గత రాత్రి ఏదో పని మీద బయటకు వచ్చిన సమయంలో గన్ గురిపెట్టి వారిని కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములుగా కాగా, మరో ముగ్గురు బయటివారు. బాధితురాళ్లు ఇద్దరు నిందితులను గుర్తించడంతో గ్రామస్ధులు వారిని పోలీసులకు అప్పజెప్పారు. బాధితులిద్దరినీ మెడికల్ పరీక్షల నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గత ఏడాది బదౌన్ సమీపంలోని ఒక గ్రామంలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, చెట్టుకి వేలాడదీసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత నవంబర్లో సీబీఐ సమర్పించిన నివేదికలో వారిపై ఎలాంటి సామూహిక అత్యాచారం జరగలేదని, కేవలం హత్య చేయబడ్డారని పేర్కొంది.