అమ్మాయిపై రేప్, హత్య కేసు: మరో ఇద్దరు అరెస్టు
జల్పాయ్గురి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమ్మాయిపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. జల్పాయ్గురి జిల్లాలోని ధూప్గురి రైల్వే ట్రాక్స్పై గత వారం ఓ అమ్మాయి శవం బయటపడిన విషయం తెలిసిందే.
గత రాత్రి ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిలిగురి రైల్వే పోలీసు ఎస్పీ దేవశీష్ సర్కార్ మంగళవారం ఆ విషయం చెప్పారు. ఇద్దరి అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లయింది. ఈ ఇద్దరి పేర్లను అమ్మాయి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సర్కార్ చెప్పారు.
ఈ కేసులో మొత్తం 13 మంది పేర్లను చేర్చారు. ఇంతకు ముందు మైనర్ బాలుడితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. ట్రాక్టర్ విషయంలో డబ్బులు చెల్లించనందుకు తన తండ్రిని ఇబ్బంది పెడుతున్నవారితో సంప్రదింపులు జరపడానికి అమ్మాయి ఆ రోజు బయలుదేరింది.
రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్న అమ్మాయిని గుర్తించిన తర్వాత ఆమె తండ్రి 13 మందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అత్యాచారం, హత్య, అపహరణ కింద సెప్టెంబర్ 2వ తేదీన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.