బ్యాంకులో డబ్బులు నిలిచిపోయాయి.. రోడ్డున పడ్డం... ఆర్బీఐ ఎదుట పీఎంసీ బాధితుల నిరసన
పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు స్కాం ఖాతాదారుల పాలిట శాపంగా మారింది. ఆరునెలలకు రూ.40 వేల కన్నా మించి విత్ డ్రా చేయొద్దని అకౌంట్ హోల్డర్స్కు రిజర్వ్ బ్యాంక్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నగదు తీసుకోలేక నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొందరు ఆందోళన చేపట్టారు. తమ నగదు తమకు ఇప్పించాలని నిరసన చేపట్టారు.
ఆర్బీఐ కార్యాలయం ఎదుట..
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తమకు వైద్యం కోసం నగదు అవసరమని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. వీరిలో ఒకరు మహిళ కాగా మరొకరు సీనియర్ సిటిజెన్.. చాలామంది ఉన్నారు. తమ నగదు తమకు ఇప్పించాలని నినాదాలు చేశారు. నినాదాలు చేసి వారు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బలగాల మొహరింపు
ఖాతాదారుల ఆందోళన తర్వాత ఆర్బీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. తమ డబ్బులు తిరిగి ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఇక్కడినుంచి తిరిగి వెళ్లబోమని అకౌంట్ హోల్డర్స్ డిమాండ్ చేశారు. పీఎంబీ బ్యాంకులో కుంభకోణం వెలుగులోకి రావడంతో ఖాతాదారుల నుంచి విత్ డ్రాను కుదించిన సంగతి తెలిసిందే. తొలుత రూ.వెయ్యి, తర్వాత రూ.10 వేల తీసుకొవచ్చని స్పష్టంచేసింది. దానిని ఆర్నెల్లకు రూ.40 వేలు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
బ్యానర్లతో నిరసన
అంతకుముందు మహిళ బ్యానర పట్టుకొని నిరసన తెలిపారు. మా డబ్బులు బ్యాంకులో నిలిచిపోయాయి. ఇప్పుడు మేం రోడ్డు మీద ఉన్నాంటూ నినాదాలు చేశారు. పీఎంసీ బ్యాంకును కాపాడండి, తమకు మేలు చేయండి అంటూ నినాదాలు చేశారు. పీఎంసీ బ్యాంకు గత 15 ఏళ్ల నుంచి ఖాతాదారునిగా ఉన్నానని గుర్తుచేశారు. ఆర్బీఐ అధికారులు కూడా బ్యాంకుకు ఏ గ్రేడ్ ఇచ్చారని తెలిపారు. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది అని ఆమె ప్రశ్నించారు. బ్యాంకులో ఖాతాదారుల సొమ్మే కదా ఉన్నది.. నల్లధనం ఉందా అని ఆమె ప్రశ్నించారు. కానీ తమకు ఆర్నెల్లకు రూ.40 వేల ఇస్తామని చెప్పడంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు.
ఈఎంఐ ఎలా కట్టాలి
ఇటీవల తాను ఇల్లు కొన్నానని మరో ఖాతాదారుడు మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బిల్డర్కు నెలకు రూ.లక్ష చొప్పున కట్టాలని.. ఇప్పుడు ఆర్నెల్లకు రూ.40 వేలు ఇస్తామని చెబితే.. మిగతా డబ్బు ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నించారు. దీంతో తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంకు ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకొనే వెసులుబాటు కల్పించాలని కోరారు.
4 వేల కోట్ల స్కాం
పీఎంసీ బ్యాంకులో రూ.4 వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారుల విత్ డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్నెల్లకు రూ.40 వేలు విత్ డ్రా చేసుకోవాలని సూచించడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో నలుగురు ఖాతాదారులు చనిపోయిన సంగతి కూడా తెలిసిందే.