ఢిల్లీ రేప్ కేసు: స్పందించిన క్యాబ్ సర్వీస్... విచారణలో పోలీసులకు పూర్తి సహకారం
న్యూఢిల్లీ: డిన్నర్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న 27 మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం జరిపిన ఘటనలో ఉబెర్ క్యాబ్ సర్వీస్ స్పందించింది. ఈ కేసుకి సంబంధించి పోలీసుల విచారణలో తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. డ్రైవర్ చేసిన ఈ పనికిమాలిన పనికి అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై పోలీసులకు పూర్తి స్ధాయిలో సహకరిస్తామని తెలిపారు.
భారత్లో తమ మొదటి ప్రాధాన్యత ప్యాసింజర్ల భద్రతేనని అన్నారు. ఉబెర్ క్యాబ్ సర్వీస్ ద్వారా ప్రయాణించే ప్రయాణాలకు జవాబుదారీతనం, కనిపెట్టగలిగే శక్తి ఉందని అన్నారు. క్యాబ్ డ్రైవర్తో పాటు వాహన సమాచారం అందిస్తున్నామని ఉబెర్ క్యాబ్ సర్వీస్ ప్రతినిధి ఎవెలిన్ తే చెప్పారు.
ఇక వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి డిన్నర్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న 27 మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్లోక్లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్లో పనిచేస్తోంది.
మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.
డ్రైవర్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురకు చెందిన శివ కుమార్ యాదవ్ (32)గా గుర్తించారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపేసి విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. బాధిత మహిళ కారు నెంబర్ ప్లేట్ ఫోటో తీసింది. ఆ తర్వాత సంఘటనపై సమాచారం ఇవ్వడానికి పిసిఆర్ కాల్ చేసింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, ఆమెకు మత్తు పదార్థాలు ఏవీ ఇవ్వలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.