ఉదయపూర్: మొహమ్మద్ ప్రవక్త పేరుతో టైలర్ హత్య.. వీడియోలో ప్రధాని మోదీని కూడా బెదిరించారు
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు, ఒక టైలర్ దుకాణంలోకి ప్రవేశించి టైలర్ను హత్యచేశారు. హత్య చేస్తుండగా వీడియో తీశారు.
ప్రవక్త మొహమ్మద్పై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్టు వీడియోలో పేర్కొన్నారు.
చనిపోయిన వ్యక్తి కన్నయ్యలాల్గా పోలీసులు గుర్తించారు. నిందితులు ఇద్దరినీ రాజ్సమంద్ జిల్లాలోని భీమ్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్గా గుర్తించారు. కన్నయ్యలాల్ని గొంతు కోసి చంపినట్టు ఇద్దరూ వీడియోలో అంగీకరించారు. ప్రధాని మోదీని కూడా చంపేస్తామని బెదిరించారు.
ఈ ఘటనతో ఉదయ్పూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు దర్యాప్తుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాన్ని పంపింది. ఈ వ్యవహారంపై తీవ్రవాద కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో 600 మంది అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు రాజస్థాన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) హవా సింగ్ ఘుమారియా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
దీనితో పాటు, సీఆర్పీసీ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఉదయపూర్ జిల్లాలోని ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
- నూపుర్ శర్మ: మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు భారత్ క్షమాపణ చెప్పాలన్న ఖతర్.. భారత్ ఏమని బదులిచ్చిందంటే..
- జైలులో ముస్లింలను కొడుతున్న వీడియోను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే- బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి
https://twitter.com/ANI_MP_CG_RJ/status/1541765546655436801
ఫేస్బుక్లో వివాదాస్పద పోస్ట్
రాజస్థాన్ పోలీసులు అందజేసిన వివరాల ప్రకారం, తన కుమారుడు పొరపాటున ఫేస్బుక్లో ఒక అభ్యంతరకర పోస్ట్ పెట్టినట్టు గతంలో కన్నయ్యలాల్ తెలిపారు.
నిందితులిద్దరూ మోటార్సైకిల్పై తప్పించుకునేందుకు ప్రయత్నించారని, ముఖాలు కనిపించకుండా హెల్మెట్ పెట్టుకున్నారని రాజ్సమంద్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
అయితే, వెంటనే నిందితులను గుర్తించారని, వారిని పట్టుకునేందుకు 10 బృందాలను నియమించారని సుధీర్ చౌదరి తెలిపారు.
ఉదయపూర్ కలెక్టర్ తారా చంద్ మీణా, ఎస్పీ మనోజ్ కుమార్ సహా పదుల సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ఉదయపూర్ జిల్లా మేజిస్ట్రేట్ తారాచంద్ మీణా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన తరువాత ఉదయ్పూర్లోని కొన్ని ప్రాంతాలకు నిప్పు పెట్టారని, నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఉదయ్పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, "ఇది దారుణ హత్య. నిందితులను గుర్తించాం. పోలీసు బృందాలు వారికోసం గాలిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కారణంగానే ఈ హత్య జరిగిందా అని మీడియా ప్రశ్నించింది.
"రికార్డులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అన్నీ కోణాలూ పరిశీలించి కలెక్టర్తో చర్చిస్తున్నామని" ఆయన చెప్పారు.
సోషల్ మీడియాలో మరో వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. పోస్టు రాసిన వ్యక్తిని చంపాలని ఒక ముస్లిం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
- కర్ణాటక: హిందూ ఆలయంలో అరటి పండ్ల ముస్లిం వ్యాపారిపై ఏమిటీ వివాదం, అసలేం జరుగుతోంది?
- ఉత్తరప్రదేశ్ మదరసాలలో యోగా చేయించిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్, విద్యార్థులు ఏమంటున్నారు?
ఎవరీ కన్నయ్యలాల్?
ఉదయ్పూర్లోని ధాన్మండి పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నయ్యలాల్ టైలర్స్ షాప్ నడుపుతూ ఉండేవారు.
మంగళవారం మధ్యాహ్నం బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో ఇద్దరు వ్యక్తులు టైలర్ దుకాణానికి వచ్చారు. కన్నయ్యలాల్ను బయటకు ఈడ్చి కత్తితో గొంతు కోసి చంపారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
'దయచేసి వీడియోను షేర్ చేయవద్దు'
ఈ ఘటన తరువాత హిందూ సంస్థలు కోపంతో ఊగిపోయాయి. పట్టణంలోని బజార్లను మూసివేశారు. నిరవధిక బంద్ ప్రకటించారు.
మరోవైపు, నగరంలో శాంతిభద్రతలను కాపాడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
"ఉదయ్పూర్లో టైలర్ దారుణ హత్యను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు లోతులకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తాం" అని ఆయన అన్నారు.
"ఈ ఘటనను సంబంధించిన వీడియోను షేర్ చేయడం ద్వారా వాతావరణాన్ని మరింత దిగజార్చవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వీడియోను షేర్ చేస్తే, సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే నేరస్థుడి ఉద్దేశ్యం విజయవంతమవుతుంది" అని గెహ్లాట్ అన్నారు.
ఈ వీడియోను ప్రసారం చేయవద్దని రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం ఎల్ లాటర్ మీడియా ఛానళ్లకు విజ్ఞప్తి చేశారు.
వీడియోను వైరల్ చేసిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీజీ హవా సింగ్ ఘుమారియా స్పష్టం చేశారు.
- 'మహమ్మద్ ప్రవక్తపై భారత్లో చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారమే గురుద్వారాపై దాడి’ - ఇస్లామిక్ స్టేట్
- బుల్డోజర్: భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్న మెషీన్
రాజకీయ స్పందనలు
ఉదయపూర్ హత్య కేసులో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
"ఉదయ్పూర్లో పట్టపగలు ఓ అమాయకుడిని దారుణంగా హత్య చేశారు. దీన్నిబట్టి, రాష్ట్ర ప్రభుత్వం అండ చూసుకుని నేరస్థులు రెచ్చిపోతున్నారని స్పష్టమైంది. రాష్ట్రంలో మతపరమైన ఉన్మాదం, హింస చోటుచేసుకున్నాయి. నేరస్థులు చాలా తెలివితక్కువవారు. ప్రధానమంత్రిని బెదిరించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి" అని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆరోపించారు.
"ఉదయ్పూర్లో జరిగిన దారుణ హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మతం పేరుతో ఉన్మాదాన్ని సహించలేం. ఈ హత్యతో భయాందోళనలు రేకెత్తించాలని ప్రయత్నించినవారిని వెంటనే శిక్షించాలి. మనమందరం కలిసి విద్వేషాన్ని రూపుమాపాలి. శాంతిభద్రతలను, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
https://twitter.com/RahulGandhi/status/1541791339544596481
"ఉదయపూర్ దారుణ హత్యను ఖండిస్తున్నారు. ఈ ఘటన ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇలాంటి హింసను మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చట్టబద్ధమైన పాలన కొనసాగాలి" అని ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
https://twitter.com/asadowaisi/status/1541778616450576386
"ఇలాంటి హత్యలకు నాగరిక సమాజంలో చోటు లేదు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.
https://twitter.com/IrfanPathan/status/1541787759316242434
"మీరు ఏ మతాన్ని అనుసరించినా సరే, ఒక అమాయకుడిని హింసిస్తే మొత్తం మానవత్వాన్ని హింసించినట్టే" అని క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న 4 కొత్త మందులు
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు
- అమెరికా-టెక్సస్: రోడ్డు పక్కన వదిలేసిన ట్రక్కులో 46 మృతదేహాలు... గాలీ, నీరూ లేక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)