పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది..ఇప్పుడేమో శివసేన కొత్త పల్లవి అందుకుంది
నాగ్పూర్: పౌరసత్వ సవరణ బిల్లుకు మాజీ మిత్రపక్షం బీజేపీకి లోక్సభలో మద్దతు ఇచ్చిన శివసేన తిరిగి అదే బిల్లుపై కమలం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే. సింధూ నది నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒక్క తాటికిందకు రావాలని కలలుగన్న వీర్ సావర్కర్ ఆశయాన్ని బీజేపీ నాయకులు అవమానించారని ఉద్దవ్ థాక్రే మండిపడ్డారు.
దేశంలో పలు ప్రధానాంశాలు ఉండగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చి ఆ అంశాలనుంచి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మహిళల భద్రత, నిరుద్యోగం, రైతు సమస్యలు వంటి ప్రధాన సమస్యలు ఉండగా వీటిని గాలికొదిలేసిన కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లు పట్టుకుని వ్రేలాడుతోందని ఫైర్ అయ్యారు ఉద్ధవ్ థాక్రే.
పౌరసత్వ సవరణ చట్టం హిందూ జాతీయవాది అయిన వీర్ సావర్కర్ ఆశయాలకు వ్యతిరేకమని చెప్పారు ఉద్ధవ్ థాక్రే. సింధూ నుంచి కన్యాకుమారి వరకు అందరినీ ఒకే దేశంకిందకు తీసుకురావాలని సావర్కర్ చెప్పారని గుర్తుచేసిన ఉద్ధవ్... బీజేపీ మాత్రం ఇతర దేశాల్లో ఉన్న మైనార్టీలను దేశంలోకి తీసుకొచ్చి పౌరసత్వం కట్టబెడుతోందని మండిపడ్డారు. ఇది సావర్కర్ను అవమానించడమే అని చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లు సిద్ధాంత పరంగా రూపొందించడం జరిగిందా అని ప్రశ్నించారు. ఒకవేళ అదే నిజమైతే మరి బిల్లుపై ఎందుకు హింసా వాతావరణం కనిపిస్తోందని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే సావర్కర్పై తమ స్టాండ్ ఎప్పటికీ మారబోదని సీఎం ఉద్దవ్ థాక్రే చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సావర్కర్ పేరు ఉపయోగించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్దవ్ పై వ్యాఖ్యలు చేయడం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం మహారాష్ట్రలో అమలు చేస్తారా అన్న ప్రశ్నకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక దానిపై ఆధారపడి ఉంటుందని సీఎం ఉద్ధవ్ సమాధానం ఇచ్చారు.
కొత్తగా సవరణ చేసిన బిల్లుపై న్యాయసమీక్ష చేస్తున్నామని చెప్పిన ఉద్దవ్.. కొందరు పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని ... కొత్తగా చేసిన చట్టం రాజ్యాంగంకు అనుకూలంగా ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త పౌరసత్వ చట్టంపై తాము సంధించిన ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదని చెప్పారు ఉద్ధవ్ థాక్రే.












Click it and Unblock the Notifications