సీఎం అవుతానని కలలో ఊహించలేదు.. సోనియా వల్లే.. ఉద్దవ్ థాకరే ఎమోషనల్
మహారాష్ట్ర నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముందే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో 80 గంటల ప్రభుత్వం కథ కేబినెట్ ఏర్పాటు కాకుండానే క్లైమాక్స్కు చేరుకొన్నది. దాంతో శివసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టేందుకు చకచకా పావులు కదిపింది. గవర్నర్ను కలిసి సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడం.. తదనంతరం ఉద్దవ్ థాకరే సీఎంగా ప్రమాణం చేయడానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఉద్దవ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ..
మహా అసెంబ్లీ సమావేశం: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేడే: 28 సాయంత్రం 6.40 కి సీఎంగా ఉద్దవ్ ప్రమాణం
కలలో కూడా ఊహించలేదు
దేశంలోనే ప్రభావవంతమైన మహారాష్ట్రను పాలించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తానని కలలో కూడా ఊహించుకోలేదు. ఇలాంటి హోదాను చేపట్టడానికి కారణమైన సోనియా గాంధీ, ఇతర నేతలకు ధన్యవాదాలు అని ఉద్దవ్ థాకరే అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్న క్లిష్టమైన సమయంలో ఇలాంటి అవకాశం రావడం ఛాలెంజ్గా ఉంది అని ఆయన తెలిపారు.
సభలో సీఎం లేకుండా ప్రమాణ స్వీకారాలు..
కొలువుదీరిన 14వ మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారంగా భావోద్వేగాల మధ్య జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఎంపిక కాకుండానే సభా సమావేశాలు జరగడం విశేషంగా మారింది. మహారాష్ట్ర చరిత్రలో గత దశాబ్దాలుగా ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాతనే ఎమ్మెల్యేలు చేసేవారు. కానీ ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి లేకుండానే ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు అని అసెంబ్లీ ఇంచార్జ్ సెక్రెటరీ రాజేంద్ర భగవత్ అన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సభలో బలపరీక్ష జరుగుతుందన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా అజిత్ పవార్
ప్రొటెం స్పీకర్గా ఎంపికైన కాళిదాస్ కొలంబర్ సభ్యుల చేత ప్రమాణం చేయిస్తున్నారు. విజయ్ కుమార్ గావిట్, రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. సభలో దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఛగన్ భుజ్భల్, కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్, తదితరులు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సభ్యులతో కలిసి ఫడ్నవీస్ కూడా ప్రమాణం చేస్తారు.
డిప్యూటీ సీఎంలు ఎవరో..
అసెంబ్లీలో ఓ పక్క ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం జరుగుతుండగానే శివసేన అధినేత ఉద్దవ్ థాకరే భార్య రష్మీతో కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కోష్యారీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం పదవిని ఎవరు చేపట్టాలనే విషయంపై ఇంకా నిర్ణయం జరుగలేదు అని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ అన్నారు. ప్రస్తుతం థోరట్ పేరు డిప్యూటీ సీఎంగా బలంగా వినిపిస్తున్నది.