కరోనా ఉధృతి: భారత్ పర్యటనను కుదించుకున్న యూకే ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్/న్యూఢిల్లీ: బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెల చివరలో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆయన తన పర్యటనను కుదించుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ నెల చివరలో మనదేశంలో పర్యటించనున్న బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. మార్పులు చేసిన బ్రిటన్ ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ఏప్రిల్ నెల చివరి వారంలో బోరిస్ జాన్సన్ భారతదేశంలో పర్యటిస్తారని బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవంలో బోరిస్ జాన్సన్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆ దేశంలో కరోనా కొత్త రకం విజృంభణ కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
యూకేలో కొత్త రకం వైరస్ వేగంగా వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. గత కొంతకాలంగా కరోనావైరస్ కేసులు తగ్గుతున్న క్రమంలో బోరిస్ జాన్సన్ మనదేశంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు
కాగా, ఇప్పుడు మనదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను కుదించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
'కరోనావైరస్ అనేది తరతరాలుగా మనం చూసిన అత్యంత విధ్వంసక శక్తి, మనం అనుభవించిన ఆధునిక ప్రపంచానికి గొప్ప పరీక్ష. మెరుగైన భవిష్యత్తును సృష్టించడానికి బహిరంగ స్ఫూర్తితో ఏకం కావడం ద్వారా సవాలును మేము చేరుకోవడం సరైనది' అని యూకే ప్రధానిని ఉటంకిస్తూ విడుదల చేసింది.
తాను కూడా బోరిస్ జాన్సన్ భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మనదేశంలో బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ తెలిపారు. యూకే ప్రధాని పర్యటనతో భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ తర్వాత బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.