రేపిస్టును బాధితురాలి ముందే చిత్రహింసలు పెట్టాం: ఉమాభారతి సంచలనం
అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులకు సరైన శిక్షలు పడకపోవడంపై కేంద్రమంత్రి ఉమా భారతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగ్రా: అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులకు సరైన శిక్షలు పడకపోవడంపై కేంద్రమంత్రి ఉమా భారతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పరిపాలిస్తున్న సమయంలో రేపిస్టులు 'ప్రాణం కోసం ప్రాథేయపడేలా' చిత్రహింసలు పెట్టిమరీ శిక్షించినట్లు చెప్పారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ బాధితులకు న్యాయం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
'నేను పరిపాలిస్తున్న సమయంలో ఓ రేపిస్టును పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టాం. బాధితురాలు సంతృప్తి చెందే విధంగా ఆమె ముందే అతడికి బుద్ధిచెప్పాం' అని ఉమా భారతి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆగ్రా రూరల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హేమలత తరపున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.
గత ఆగస్టులో కొందరు మానవమృగాలు ఓ మహిళ, ఆమె కూతురిపై గ్యాంగ్రేప్నకు తెగబడడంపై ఉమాభారతి స్పందిస్తూ.. 'రేపిస్టులను ఉరితీయాలి. చర్మం ఊడివచ్చేలా కొట్టాలి. కొట్టిన గాయాలపై ఉప్పు, కారం వేసి రుద్దాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేపిస్టులను అలాగే శిక్షించాను' అని పేర్కొన్నారు.
'రేపిస్టులను ఆ తరహాలో చిత్రహింసలు పెట్టడం మానవ హక్కులను ఉల్లంఘన కిందికి వస్తుందని పోలీసులు నాతో చెప్పారు. మానవ హక్కులు మనుషుల కోసమే గానీ ఇలాంటి రాక్షసుల కోసం కాదని వారికి చెప్పాను. రావణుడి మాదిరిగా వారి తలలు తీసేయాలి' అని ఉమా భారతి పేర్కొన్నారు. కాగా, 2003-2004 సంవత్సరాల్లో ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.