2019లో బీజేపీ గెలుపు మరిచిపోండి, వారణాసిలో మోడీ గెలవరు: రాహుల్ గాంధీ
బెంగళూరు: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం గురించి మరిచిపోవాలని, అప్పుడు కనీసం ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి కూడా గెలవరని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విపక్షాలకు విభిన్నమైన వ్యక్తిగత, ప్రాంతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఏకం చేస్తుందన్నారు. అన్ని విపక్షాలను ఏకతాటి పైకి తీసుకు రాగలుగుతుందన్నారు. యూపీ, బీహార్, తమిళనాడు సహా వేర్వేరు చోట్ల విపక్షాలు ఏకతాటి పైకి రావడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ఇలాంటి సమయంలో బీజేపీకి సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి తీసుకు వస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాల ఐక్యత దృఢపడుతోందన్నారు.
యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఏకమైతే బీజేపీకి అతికష్టం మీద రెండు సీట్లు మాత్రమే వస్తాయని, వారణాసిలో మోడీ ఓడిపోయే అవకాశముందన్నారు. ధైర్యముంటే మూడు పార్టీలకు వ్యతిరేకంగా వారణాసిలో పోటీ చేయాలని మోడీకి సవాల్ విసిరారు.
దేశంలో పాలన గాడితప్పడానికి మోడీ, బీజేపీల మనస్తత్వమే కారణమన్నారు. అంబేడ్కర్, బసవన్న విగ్రహాలకు నమస్కరించే మోడీ వారి సిద్ధాంతాలను కాలరాస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ పైన రాహుల్ తన ఆక్రోశం వెళ్లగక్కారు.












Click it and Unblock the Notifications