యూపీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ: యోగి ఆదిత్యనాథ్ అంచనా ఇదీ
లక్నో: ఐదు సార్లు తాను ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ లోకసభ స్థానాన్ని కోల్పోవడం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్కు ఎెదురుదెబ్బనే. దాంతో పాటు పుల్పూర్ స్థానాన్ని కూడా బిజెపి కోల్పోయింది. ఈ పరిణామంపై యోగీ ఆదిత్యానాథ్ స్పందించారు.
గోరఖ్పూర్లో ఓటమిపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గోరఖ్పూర్లో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తక్కువ అంచనా వేశామని, దాని ప్రత్యేకతను అవగాహన చేసుకోలేకపోయామని ఆయన అన్నారు.
తమ అతివిశ్వాసమే కొంప ముంచిందని కూడా ఆయన అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించి, కొత్త వ్యూహాన్ని రూపొందించుకుంటామని యోగీ ఆదిత్యానాథ్ చెప్పారు.
ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెసు వేర్వేరుగానే ఉన్నాయని, ఎన్నికల మధ్యలో పొత్తు కోసం అవగాహనకు వచ్చాయని ఆయనయ అన్నారు. దాన్ని అర్థం చేసుకోవడంలో తాము విఫలమైనట్లు తెలిపారు. ఎస్పీ, బిఎస్పీ మధ్య రాజకీయ రాజకీయ అవగాహనను కొత్త వ్యూహంతో ఎదుర్కుంటామని చెప్పారు.
2019 సాధారణ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు డ్రెస్ రిహార్సల్స్ అని యోగీ ఆదిత్యానాథ్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఈ ఓటమి బిజెపిని ఆందోళనకు గురి చేస్తుందనే మాటను ఆయన బుధవారం తిరస్కరించారు. ఉప ఎన్నికల్లో స్థానిక సమస్యలు కీలకంగా పనిచేస్తాయని, సాధారణ ఎన్నికల్లో పనిచేసే అంశాలు విడిగా ఉంటాయని, అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి ఎజెండా పనిచేస్తుందని వివరించారు.
బిఎస్పీ ఓటు ఎస్పీకి పడుతుందని తాము అంచనా వేయలేకపోయామని డిప్యూటీ సిఎం కేశవ్ మౌర్య అన్నారు. తాము విశ్లేషించుకుంటామని చెప్పారు. ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెసు ఏకమైతే ఏం చేయాలో కూడా ఆలోచిస్తామని అన్నారు 2019 ఎన్నికల్లో విజయానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకుంటామని చెప్పారు.