ఆ బస్సు మా కంపెనీదే: తల్లీకూతుళ్లపై లైంగిక దాడి చేసి, తోసేసిన ఘటనపై సిఎం
మోగా: పంజాబ్లోని మోగా జిల్లాలో అసిస్టెంట్ కండక్టర్ లైంగిక దాడికి పాల్పడడంతో తల్లీకూతుళ్లు బస్సులోంచి కిందికి దూకేసిన సంఘటనపై ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ స్పందించారు. ఆ ఘటనలో 14 ఏళ్ల కూతురు మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనను సిఎం ఖండించారు. ఆ తమ తమ కుటుంబానికి చెందిన కంపెనీదేనని ఆయన అంగీకరించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 14 ఏళ్ల బాలిక మృతిపై పంజాబ్ అధికార అకాలీదళ్ పార్టీపై కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడిగా ఆందోళనకు దిగాయి. మోగా పంజాబ్ నిర్భయ అని కాంగ్రెసు ఎంపి రవనీత్ సింగ్ బిట్టూ అన్నారు. బస్సు ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబానికి చెందిన ఆర్బిట్ ఏవియేషన్ కంపెనీకి చెందిందని ఆరోపిస్తూ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ సంబంధాల కారణంగా ఆర్బిట్ బస్సు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని, ప్రతి బస్సు డ్రైవర్ తానే సుఖ్బీర్ సింగ్నని అనుకుంటాడని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవత్ మన్ అన్నారు.
ముఖ్యమంత్రి కుమారుడు, ఉప ముఖ్యమంత్రి అయిన సుఖబీర్ సింగ్కు ఆర్బిట్లో 5 వేల వాటాలున్నాయి. సుఖబీర్ సింగ్ బాదల్ భార్య హర్షిమ్తార్ కౌర్ బాదల్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు.
దురదృష్టవశాత్తు బస్సు తమ కుటుంబానికి చెందిందేనని ప్రకాష్ సింగ్ బాదల్ అన్నారు. తనకు ఏ విధమైన ఆసక్తి లేదని, బస్సు ఎవరిదైనా సరే అటువంటిసంఘటన జరిగినందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
సంఘటనను లోకసభలో ప్రస్తావించడానికి స్పీకర్ అనుమతించకపోవడం ఆసంతృప్తిగా ఉందని బిట్టూ, మన్ అన్నారు. ఆ బస్సు తమ కుటుంబానికి చెందిన కంపెనీదేనని మంత్రి హర్సీమ్రత్ కౌర్ అంగీకరించాల్సి ఉండిందని వారన్నారు.
సంఘటనను తాను ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. బస్సులో లేదా రైలులో, లేదా రోడ్డుపై లేదా ఇంట్లో ఎక్కడైనా అటువంటి సంఘటనలు జరిగితే సహించకూడదని ఆమె అన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినందుకు తాను సంతోషిస్తున్నట్లు తెలిపారు. దోషులకు శిక్ష పడుతుందని అన్నారు.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ను, క్లీనర్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ప్రయాణికుడిని అరెస్టు చేయాల్సి ఉంది.
పంజాబ్లోని మోగ జిల్లాలో ఓ బస్సు కండక్టర్ సహాయకుడు బస్సు ఎక్కిన తల్లీకూతుళ్లపై లైంగిక దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు బస్సులోంచి దూకేశారు. ఈ ఘటనలో 13 ఏళ్ల కూతురు మరణించగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.