UNION BUDGET 2020:ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలపై దృష్టి.. పీఎం జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . ఉదయం 11 గంటలకు లోక్సభలో తెలుగింటి కోడలు నిర్మల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వెయ్యటమే కాకుండా వైద్య, పారిశుధ్య రంగాలకు కూడా తగిన ప్రాధాన్యమిచ్చారు .ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించారు .
ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట్ ప్రవేశపెట్టారు . ఈసారి బడ్జెట్ లో ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు . 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్కు పత్యేక ప్రాధాన్యత కల్పించిన కేంద్రం రూ.11,500 కోట్లు కేటాయించింది. దాంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను స్వచ్ఛ భారత్ మిషన్కు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
పౌష్టికాహారం , క్లీన్ ఎయిర్ పాలసీలకు బడ్జెట్
క్లైమేట్ చేంజ్ పాలసీ కోసం రూ.4,400 వందల కోట్లు కేటాయించామని, అలాగే క్లీన్ ఎయిర్ పాలసీ కోసం రూ.4,400 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. అంతే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈసారి ఆరోగ్యానికి భారీగానే బడ్జెట్ కేటాయింపులు చేశారు. పౌష్టిక ఆహారానికి రూ.35 వేల కోట్లు కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు
ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఆయుష్మాన్భవ పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 20 వేల ఆస్పత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ జనరిక్ మందులు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీబీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దానికోసం విసృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు.