Union Budget 2023: సప్త ఋషుల రీతిలో 7అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత.. వ్యవసాయానికి కేటాయింపులిలా!!
సప్త ఋషుల రీతిలో 7అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ లో అనేక కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు.
2023-2024 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఒక గంట 26 నిమిషాల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె అనేక కీలక విషయాలను వెల్లడించారు. ఏడు ప్రాధాన్యత అంశాలుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ సామాన్య మధ్యతరగతి వేతన జీవులకు ఉపశమనాన్ని ఇచ్చే బడ్జెట్ గా అభివర్ణించారు.
వ్యవసాయానికి పెద్ద పీట వేసిన బడ్జెట్
అంతేకాదు సప్త ఋషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యతని ఇస్తుందని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశారు. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. అమృతకాలంలో తొలి బడ్జెట్ ఇది అని పేర్కొన్న నిర్మల సీతారామన్, భారతదేశ సందర్భంగా తలెత్తుకుని నిలబడే బడ్జెట్ ఇది అని అభివర్ణించారు. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత నిస్తున్నట్టు తెలిపారు.
20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలతో రైతులకు అండగా
20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలతో వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు, మార్కెటింగ్ సదుపాయం పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ స్టార్టప్ లకు, చేయూత ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు, తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు ఆమె తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ద్వారా ఉద్యానవన పంటలకు చేయూతనివ్వనున్నట్టు వెల్లడించారు.
ప్రకృతి వ్యవసాయానికి దన్నుగా అనేక నిర్ణయాలు
పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు, పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం మరిన్ని గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటి మంది రైతులకు సాయం చేయనున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. మూడేళ్ళలో కోటి మందికి సాయం అందించనున్నట్టు తెలిపారు.
శ్రీ అన్న పథకంతో చిరు ధాన్యాల పంటలకు సహకారం
చిరుధాన్యాల పంటలకు కూడా సహకారం అందించనున్నట్టు, దీనికోసం శ్రీ అన్న పథకాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహాన్ని అందిస్తామని వెల్లడించారు. శ్రీ అన్న పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. పదివేల బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?