కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం-ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్ లో వేసే పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం వెల్లడించింది.
ఖరీఫ్ సీజన్కు కనీస మద్దతు ధర (MSP) పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. 2022-23 సంవత్సరానికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ఇప్పుడు పెరుగబోతోంది. 2022-23 సంవత్సరానికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర 5 నుంచి 20% వరకు పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేబినెట్ నిర్ణయం తర్వాత, ఖరీఫ్ పంటలు అంటే వరి, సోయాబీన్ల ఎంఎస్పిలో పెరుగుదల ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో మొక్కజొన్న ఎంఎస్పీని పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గతేడాది వ్యవసాయ బిల్లుల రద్దుకు ఉద్యమించిన రైతులు అప్పటి నుంచి పంటల మద్దతు ధర పెంచమని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం వ్యవసాయ బిల్లుల రద్దుతోనే సరిపెట్టింది. కానీ ఈ ఏడాది గుజరాత్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే పలు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్ధిక సంవత్సరానికి పంటల గిట్టుబాటు ధర పెంచినట్లు తెలుస్తోంది. కేంద్రం పెంచిన గిట్టుబాటుధరలు త్వరలో అమల్లోకి రానున్నాయి.