ప్రధాని మోదీ కింకర్తవ్యం- నేడు కేంద్ర కేబినెట్ అసాధారణ భేటీ
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఏపీ మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా ప్రతిఘటించిన ఈ డిలిమిటేషన్ బిల్లుపై సభలో అధికార పక్షానికి చుక్కెదురైంది. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఇది వీగిపోయింది. దీంతో విపక్షాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది.
దీన్ని దురదృష్టకరంగా అభివర్ణించింది కేంద్ర ప్రభుత్వం. సవరణలతో ముడిపడిన కేంద్రపాలిత ప్రాంతాలు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కూడా నిలిపివేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. తమ ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సవరణలతో కూడిన బిల్లును మరోసారి సభ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల మధ్య నేడు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతోంది. ఈ ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటవువుతంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా ఇతర మంత్రులందరూ దీనికి హాజరు కానున్నారు. ఇది అసాధారణ సమావేశం. సాధారణంగా కేంద్ర మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమౌతుంటుంది. దీనికి భిన్నంగా నేడే ఈ భేటీ ఏర్పాటు కాబోతోంది.
డీలిమిటేషన్ బిల్లు వీగి పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తలెత్తిన పరిణామాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొనడంపై ఇందులో చర్చిస్తారని తెలుస్తోంది. బిల్లులో చేయాల్సిన సవరణల అంశం ఈ సందర్భంగా చర్చకు రానుంది. ఈ బిల్లు వల్ల నష్టపోతామని వాదిస్తోన్న దక్షిణాది రాష్ట్రాలకు నమ్మకం కలిగించేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సవరణలు చేయాలి అనే విషయాలపై నేటి కేంద్రమంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.
లోక్సభలో 12 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా.. అధికార పక్షం ఎక్కడ తడబాటు ప్రదర్శించింది, బిల్లు వీగిపోవడానికి గల కారణాలపై కేంద్రమంత్రులు సమగ్రంగా అధ్యయనం చేస్తారిందులో. జనగణన తర్వాతే అమలు చేయాలన్న నిబంధన తొలగింపు ప్రతిపాదన దీనిలో కీలకమైనది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ప్రభావం ఉంటుందా అన్న ఆందోళనలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications