దేశ వ్యాప్త లాక్ డౌన్ పై నిర్మలా సీతారామన్: కట్టడి వ్యూహం చెప్పిన కేంద్ర మంత్రి !!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా రెండవ దశ అత్యంత తీవ్రంగా కొనసాగుతూ భారతదేశంలో దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది . ఇక ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్త లాక్డౌన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్థానిక నియంత్రణను మాత్రమే ఆశ్రయిస్తున్నామని పేర్కొన్న నిర్మలాసీతారామన్ కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ పెట్టబోదని స్పష్టం చేశారు .
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ తో వర్చువల్ సమావేశంలో నిర్మలా సీతారామన్
దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తే తట్టుకోలేని ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టటం తమకు ఇష్టం లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్తో జరిగిన వర్చువల్ సమావేశంలో, అభివృద్ధికి, ఆర్థిక లభ్యతను పెంచడానికి భారతదేశానికి రుణ సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు. కరోనా కట్టడికి 5 స్తంభాల వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు నిర్మలాసీతారామన్ .
ఐదు స్తంభాల వ్యూహంతో కరోనా ను కట్టడి చేస్తాం
టెస్ట్ , ట్రాక్ , ట్రీట్ , వ్యాక్సిన్ , రూల్స్ అనే ఐదు స్తంభాల వ్యూహంతో కరోనా ను కట్టడి చేస్తామన్నారు. ఆయా రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని తెలుసుకుంటున్నామని పేర్కొన్న ఆర్థిక మంత్రి, కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి అన్నారు. కరోనా రెండవ దశలో గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున లాక్డౌన్ల కోసం వెళ్ళడం లేదని స్పష్టంగా చెప్పిన నిర్మల సీతారామన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.
పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండబోదు ,.. స్థానిక నియంత్రణపైనే దృష్టి
రోగులను హోమ్ క్వారంటైన్ చేయడం, ఎక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే కఠిననిబంధనలు విధించడం, స్థానిక కట్టడికి చర్యలు తీసుకోవటం వంటి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో నిర్మల సీతారామన్ ఎల్ఈడీ బల్బుల పంపిణీ, నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ కింద ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం, స్వచ్ఛంద వాహనాల స్క్రాపింగ్ విధానం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వంటి ఇతర అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు.
కరోనా సెకండ్ వేవ్ పంజా .. ఏప్రిల్ నెల రెండో వారానికి గరిష్ట స్థాయికి కేసులు .. ఆందోళన
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్టు గుర్తించగా, ఈ విజృంభణ ఏప్రిల్ నెల రెండో వారానికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.గణిత నమూనాలను ఉపయోగించి అంచనా వేశామని శాస్త్రవేత్తలు ఏప్రిల్ రెండో వారం తర్వాత విజృంభించి కరోనా మే చివరినాటికి క్షీణిస్తుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏప్రిల్ రెండో వారంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్ 14 వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్ లో 1.84లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది .