లఖీమ్ పూర్ ఇష్యూ: ఆశీష్ మిశ్రా అరెస్ట్.. 12 గంటల విచారణ తర్వాత
లఖిమ్ పూర్ ఖేరి ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. బాధ్యుడైన ఆశీష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఆశీష్ మిశ్రాను విచారించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు లఖిమ్ పూర్లో ఉదయం నుంచి ఎంక్వైరీ చేశారు. 12 గంటల తర్వాత అరెస్ట్ చేశామని ప్రకటించారు. విచారణకు సహకరించకపోవడంతో.. అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
తమ విచారణకు సహకరించడం లేదని డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ తెలిపారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. అతనిని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతు ధర కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లఖింపూర్లో కూడా రైతులు నిరసన తెలియజేస్తుండగా.. కేంద్రమంత్రి కుమారుడు కారుతో తొక్కించాడు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది చనిపోయారు.
లఖిమ్పూర్ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను ఢీ కొని వెళ్లిపొయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం.