ఉన్నావ్ రేప్: ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు, ఇద్దరు అదృశ్యం: బాధితురాలి బాబాయి
లక్నో: ఉన్నావ్ రేప్ కేసులో బిజెపి అరెస్టైన బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అనుచరులు గ్రామస్థులను బెదిరించారని బాధితురాలి బాబాయి ఆరోపించారు. తమకు నిందితుల నుండి బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇద్దరు గ్రామస్థులు కన్పించకుండా పోయారని ఆయన చెప్పారు.
ఉన్నావ్లో ఓ యువతిని బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అతని సోదరుడు , అనుచరులు అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైంది.ఈ కేసులో బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట వారం రోజుల క్రతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ సమయంలో ఆ యువతికి ఆమె కుటుంబసభ్యులు కూడ మద్దతుగా నిలిచారు.
ఈ ఘటన జరిగిన మరునాడే పోలీస్ స్టేషన్లో బాధితురాలి తండ్రి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కుల్దీప్సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలి బాబాయి తాజాగా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమ కుటుంబసభ్యులతో పాటు, గ్రామస్థులపై ఎమ్మెల్యే గూండాలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నోరు మెదపకూడదంటూ ఎమ్మెల్యేకు చెందిన మనుషులు శనివారం నాడు తమ గ్రామానికి వచ్చి తమను బెదిరించారని చెప్పారు. ఈ కేసు విషయమై నోరు తెరవవద్దని హెచ్చరించినట్టు ఆయన చెప్పారు గ్రామాన్ని వదిలివెళ్ళాలని బెదిరించారన్నారు.
ఎమ్మెల్యే మనుషులు బెదిరింపులకు పాల్పడిన తర్వాత నుండి ఇద్దరు గ్రామస్థులు కన్పించకుండాపోయారని ఆయన చెప్పారు. అయితే వారిద్దరూ ఎక్కడకు వెళ్ళారు. ఈ వ్యవహరంలో ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.