ఉన్నావ్ రేప్: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్, అవమానించకండి.. ఆయనకు ఓటేయమన్నారుగా: స్మృతిఇరానీ
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను పదిహేను గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలని అలహాబాద్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
చదవండి: మన కూతుళ్లకు తప్పకుండా న్యాయం: ఉన్నావ్-కథువా రేప్ ఘటనలపై మోడీ, కాంగ్రెస్పై ఫైర్
పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సెంగార్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ సెంగార్పై మూడు వేర్వేరు కేసులు నమోదు చేసింది. శుక్రవారం ఉదయం ఆయనను ఈ కేసులపై ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకుంది.
చదవండి: రేప్ నిందితులకు మద్దతు, మోడీ ఆగ్రహం: బీజేపీకి మంత్రులు రాజీనామా
అరెస్ట్ చేయండి
అయితే సెంగార్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారని, ఇంకా అరెస్ట్ చేయలేదని యూపీ ప్రభుత్వ కౌన్సిల్ కోర్టుకు వెల్లడించడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీబీ భోస్లే, జస్టిస్ సునీత్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనను అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు చట్ట ప్రకారం చాలా కఠినంగా నిర్వహించాలని కోర్టు సీబీఐకి తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మే 2న స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. కుల్దీప్ను అరెస్ట్ చేయకపోవడంపై అంతకుముందు రోజు కూడా అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్ని కేసుల్లో ఆధారాల కోసం ఎదురు చూస్తుంటారా అని ప్రశ్నించింది. బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగుతున్నా నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించింది. అన్యాయం జరిగినప్పుడు పోలీసుల దగ్గరికి కాకుండా ఇంకెక్కడి వెళ్తారని కోర్టు నిలదీసింది.
బీజేపీ స్పందనను మీడియా ప్రసారం చేయడం లేదు
మరోవైపు, ఉన్నావ్, కథువాలలో జరిగిన అత్యాచారాలపై బీజేపీ మహిళా మంత్రులు మౌనంగా ఉన్నారనే ప్రచారంపై కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, మేనకా గాంధీ, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి స్పందించారు. తాము మౌనంగా లేమని, తమ వార్తలు మీడియాలో రావడం లేదన్నారు. జమ్మూ కాశ్మీరులోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై జరిగిన దారుణాన్ని బీజేపీ అధికార ప్రతినిథి మీనాక్షి లేఖీ విలేకర్ల సమావేశంలో ఖండించారు. కథువా, ఉన్నావ్ అత్యాచారాలను తమ పార్టీ ఖండిస్తోందన్నారు. ఈ కేసులపై బీజేపీ స్పందనను మీడియా ప్రసారం చేయడం లేదని ఆరోపించారు.
ఉన్నావ్, కథువాలే వలే అసోం రేప్ గురించి మాట్లాడరేం
అసోంలో ఇటీవల ఐదో తరగతి చదువుతున్న పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం జరిగిందని, ఆమెను అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి దహనం చేశారని మీనాక్షి లేఖి చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుని పేరు జకీర్ హుస్సేన్ అన్నారు. కథువా, ఉన్నావ్ రేప్ కేసులపై స్పందిస్తున్న తీరులోనే ఈ అసోం బాలిక విషయంలో మీడియా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
బాధితురాలిని అవమానించకండి
కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులను రాజకీయం చేయవద్దని స్మృతి ఇరానీ అన్నారు. బాధితురాలిని అవమానించడాన్ని ఆపాలని తాను ఓ మహిళగా కోరుతున్నానని స్మృతి చెప్పారు. బాధితురాలిని అవమానించరాదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం, పరిపాలనా యంత్రాంగం వ్యవహరిస్తాయని చెప్పారు. ఇటువంటి సంఘటనలను రాజకీయం చేయాలనుకునేవాళ్ళు ఉన్నారన్నారు. కానీ ఓ మహిళగా తాను ఇటువంటి సంఘటనలపై రాజకీయం చేయవద్దని, బాధితురాలిని అవమానించడం ఆపాలని కోరుతున్నానని చెప్పారు.
అత్యాచార ఆరోపణల ప్రజాపతికి ఓటేయమన్నారుగా
ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గాయత్రి ప్రజాపతికి ఓట్లు వేయాలని అడిగినవాళ్ళు ఈరోజు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని చెప్పారు. గాయత్రి ప్రజాపతి యూపీలో సమాజ్ వాదీ పార్టీ నేత. ఆయన సీఎం అఖిలేశ్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. అత్యాచారం, అవినీతి ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో గాయత్రి ప్రజాపతికి ఓటు వేయాలని కాంగ్రెస్ కూడా కోరింది.