వైరల్ : హెలికాఫ్టర్ను కన్వర్ యాత్రికులపైకి గులాబీ రేకులు విసిరిన మీరట్ పోలీస్ అధికారి
మీరట్: ఏటా సాఫీగా జరిగే కన్వర్ యాత్ర... ఈ సారి విమర్శల పాలవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యాత్రపై గులాబీ రేకులు చల్లేందుకు 14లక్షలు పెట్టి హెలికాఫ్టర్ను అద్దెకు తీసుకున్నారు. అందులో మీరట్ జోన్ అడిషనల్ డీజీ గులాబీ రేకుల తీసుకుని కింద జరుగుతున్న యాత్రపైకి విసురుతుండటం ఇంకా పెద్ద విమర్శకు దారితీసింది. యాత్ర కోసం హెలికాఫ్టర్ అద్దెకు తీసుకోవాల్సిందిగా హోమ్శాఖ కార్యాలయం నుంచి ఆగష్టు 4వ తేదీన ఉత్తర్వులు అందాయి. ఇందులో భాగంగానే హెలికాఫ్టర్ను ఎయిర్ చార్టర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం రూ.14 లక్షలు చెల్లించి అద్దెకు తీసుకుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా... గత రెండు రోజులుగా అడిషనల్ డీజీ హెలికాఫ్టర్ నుంచి యాత్రపైకి గులాబీ రేకులు విసురుతున్న ఫోటోలు తీసుకున్నారు. ఆయనతో పాటు ఇంకొందరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం కేవలం నిఘా వ్యవస్థలో భాగంగానే హెలికాఫ్టర్ అద్దెకు తీసుకోవాలని ఉంది. అయితే పోలీస్ అధికారులు యాత్రపై గులాబీ రేకులు విసరడమేంటంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే జూలై 28న యోగీ ఆదిత్యనాథ్ హెలికాఫ్టర్లో ప్రయాణిస్తూ కింద జరుగుతున్న యాత్రపై గులాబీ రేకులు విసిరారు. అదే ఇప్పుడు అధికారులు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సామాన్య ప్రజలు.
నిఘా పెట్టాల్సిన అధికారి ప్రశాంత్ కుమార్ చాపర్ కిటికీ దగ్గర కూర్చొని కిందకు పూలు విసురుతున్న వీడియో వైరల్ అవడంతో వివాదంగా మారింది.అంతేకాదు డ్యూటీ చేయాల్సిన అధికారులు డ్యూటీ తప్ప అన్ని చేస్తున్నారని నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కన్వరియా యాత్ర కోసం యోగీ సర్కార్ రెండాకులు ఎక్కువగానే నిబంధనలు పెట్టింది. కన్వరియా యాత్ర ఏ రూట్లో అయితే సాగుతుందో ఆ దారిలో ఎక్కడా మాంసాహారం విక్రయిస్తున్న దుకాణాలు కానీ మాంసాహారం వడ్డిస్తున్న హోటళ్లను కానీ మూయించేశారు. అంతేకాదు జాతీయ రహదారిపై వస్తున్న వాహనాలను కూడా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా దారి మళ్లించారు.