షాకింగ్ : మార్నింగ్ వాక్కి వెళ్లిన బీజేపీ నేత హత్య.. దుండగుల కాల్పులు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మార్నింగ్ వాక్కి వెళ్లిన ఓ బీజేపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24గంటల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని బాగ్పాట్ గ్రామానికి చెందిన బీజేపీ నేత సంజయ్ ఖోఖర్ మంగళవారం(అగస్టు 11) ఉదయం తన ఇంటికి సమీపంలో ఉన్న పంట పొలాల మధ్య మార్నింగ్ వాక్కి వెళ్లాడు. అక్కడ అటు ఇటు నడుస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో పడి వున్న అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... చెరుకు తోట పక్కన సంజయ్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. అతని చొక్కా పూర్తిగా రక్తంతో తడిచిపోయిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంజయ్పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Recommended Video
సంజయ్కి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. గత నెలలో ఆర్ఎల్డీకి చెంది దేశ్పాల్ ఖోకర్ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.