పాఠశాలలోకి ప్రవేశించిన చిరుతపులి: పరుగులు తీసిన విద్యార్థులు
లక్నో: అడవిలో ఉండాల్సిన ఓ చిరుత పులి పాఠశాల ఆవరణలోకి వచ్చింది. గమనించిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తలుపులు మూసివేసి తమను తాము కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్లో చోటు చేసుకుంది.
ఆ ప్రాంతంలో కాసేపు తిరిగి చిరుతపులి సమీపంలోని ఓ కుక్కపై దాడి చేసి, దాన్ని ఫిలిభిత్ టైగర్ రిజర్వులోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది. ఈ ఘటనతో హడలిపోయిన విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిధి దివాకర్ రావడంతో ఆమెకు వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలకు చేరుకున్న అధికారులు.. పులి పంజా గుర్తులను ఫొటోలు తీసుకున్నారు. పంజా గుర్తులను బట్టి చూస్తే ఆ చిరుత యుక్త వయస్సులో ఉందని చెప్పారు.
సమీపంలోని పొలాల గుండా పాఠశాలలోకి ఈ పులి ప్రవేశించి ఉంటుందని తెలిపారు.
చిరుత ఒకట్రెండు రోజుల్లో తిరిగి అడవిలోకి వెళ్లిపోతుందని అధికారులు చెప్పారు. అయితే, విద్యార్థుల భద్రత కోసం, చిరుత కదలికలను కనిపెట్టేందుకు పాఠశాల వద్ద సాయుధ సిబ్బందిని నియమించారు. కాగా, పులి కారణంగా ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ పిల్లల భద్రత కోసం గ్రామస్తులందరూ వంతులవారీగా పాఠశాల వద్ద కాపలాగా ఉండాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications