UP Elections 2022: ప్రతి ఎన్నికల్లోనూ కొత్తపార్టీలతో పొత్తులు; సమాజ్వాదీ పార్టీపై విరుచుకుపడ్డ పీఎం మోడీ
ఒకపక్క ఉత్తరప్రదేశ్ లో రెండో దశ పోలింగ్ కొనసాగుతుంటే, మరోపక్క మూడో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు బిజెపిని ఓడించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సోమవారం యూపీలోని కాన్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో, పీఎం మోదీ సమాజ్వాదీ పార్టీని ప్రతీ ఎన్నికల్లోనూ కొత్త మిత్రపక్షాన్ని తీసుకువస్తుంటారని ఎద్దేవా చేశారు. స్నేహితులను మార్చుకునే వారు ఉత్తరప్రదేశ్ ప్రజలకు సేవ చేయగలరా? అంటూ ప్రశ్నించారు.

సమాజ్వాదీ పార్టీ పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమాజ్ వాదీ 'గుండా రాజ్'ని ప్రజలు అంగీకరించరని విరుచుకుపడుతున్న మోడీ సోమవారం నాడు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ పై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కొత్త భాగస్వామితో పొత్తు పెట్టుకుంటుందని విరుచుకుపడ్డారు. ప్రతి ఎన్నికల్లో, సమాజ్వాది పార్టీ తెరమీదకు కొత్త భాగస్వామిని తీసుకువస్తారని విమర్శించారు. పొత్తుల ద్వారా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. వారు ప్రతి ఎన్నికల్లో తమ పాత సహచరులకు దూరంగా నడుస్తారని, వారికి ఎప్పటికీ కొత్త స్నేహాలు కావాలన్నారు.

ఎన్నికలకో కొత్త పార్టీతో పొత్తు .. వారు యూపీ ప్రజలకు సేవ చేస్తారా?
ప్రతి ఎన్నికల్లోనూ కొత్తవారితో పొత్తు పెట్టుకుని , స్నేహితులను కూడా మార్చుకునే వారు ఉత్తరప్రదేశ్ ప్రజలకు సేవ చేయగలరా? అంటూ ప్రధాని మోదీ అఖిలేష్ యాదవ్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాన్పూర్ దేహత్ జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, యుపి ఎన్నికల మొదటి మరియు రెండవ దశలలో ఓటింగ్ పోకడలు నాలుగు విషయాలను స్పష్టం చేశాయని అన్నారు.

యూపీలో పోలింగ్ లో నాలుగు అంశాలు గుర్తించానని చెప్పిన మోడీ
మొదటిది యోగి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మళ్లీ వస్తుంది. రెండవది, యుపిని త్వరితగతిన అభివృద్ధి చేయడానికి ప్రతి కుల, తరగతి, గ్రామం మరియు నగర ప్రజలు ఐక్యంగా ఓటు వేస్తున్నారు. మూడవది, తల్లులు, సోదరీమణులు మరియు కుమార్తెలు బిజెపిని గెలిపించాలని కోరుకుంటున్నారు. నాల్గవది, ముస్లిం సోదరీమణులు మోడీని ఆశీర్వదించడానికి వారి ఇళ్లను వదిలి బయటకు ఓటు వేసేందుకు వస్తున్నారు అని ప్రధాని మోదీ సోమవారం పేర్కొన్నారు. మళ్ళీ యూపీలో బీజేపీదే అధికారం అని తేల్చి చెప్పారు.

రాష్ట్రీయ లోక్ దళ్తో కలిసి సమాజ్వాదీ పార్టీ పోటీ
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్తో కలిసి సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తోంది. 2017లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. సమాజ్ వాదీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మద్దతు ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు . ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ సోమవారం జరుగుతోంది. ఏడు దశల ఎన్నికలు మార్చిలో ముగుస్తాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.












Click it and Unblock the Notifications