Asaduddin Owaisi: ప్రధాని మోడీ..సీఎం యోగిపై ఇన్డీసెంట్ కామెంట్స్: ఎఫ్ఐఆర్ ఫైల్
లక్నో: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇందులో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలదే మెజారిటీ సంఖ్య. అందుకే- ఈ ఎన్నికలను మినీ సమరంగా భావిస్తున్నారు విశ్లేషకులు. మిగిలిన వాటి మాటెలా ఉన్నప్పటికీ- ఉత్తర ప్రదేశ్లో మాత్రం బిగ్ ఫైట్ తప్పేలా కనిపించట్లేదు. వాటి ఫలితాలు 2024 లోక్సభ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
Kim Jong Un: వీడియో: బాగా బరువు తగ్గిన ఆధునిక నియంత: తాతను తలపించేలా
మినీ వార్..
అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్.. ఇలా అన్ని రాజకీయ పక్షాలు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంకా గాంధీ వాద్రా కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ఛార్జీగా వ్యవహరిస్తోన్నారు.
వంద స్థానాల్లో మజ్లిస్..
కాగా- ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కూడా పోటీ చేయబోతోంది. ఈ ఏడాదిలోనే ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించిన స్థాయిలో రాణించింది హైదరాబాదీ మజ్లిస్ పార్టీ. ఏకంగా అయిదు స్థానాలను గెలుచుకోగలిగింది. అవే తరహా ఫలితాలను ఉత్తర ప్రదేశ్లో రాబట్టుకోవడానికి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. కసరత్తు చేస్తోన్నారు. ఏఐఎంఐఎం 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
బారాబాంకీలో ర్యాలీలు..
ఇప్పటికే ఆయన ఉత్తర ప్రదేశ్ మకాం వేశారు. రెండు చోట్ల బహిరంగ ప్రదర్శనలను నిర్వహించారు. ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. బుధ, గురువారాల్లో బారాబాంకీ జిల్లాల్లో వరుస సభల్లో పాల్గొన్నారు. ముస్లింల ఓటుబ్యాంకు అధికంగా ఉండే జిల్లాల్లో బారాబాంకీ ఒకటి. ముస్లిం బెల్ట్ ఎక్కువ. మైనారిటీ వర్గాల ఓటర్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభలను నిర్వహించారు.. రోడ్షోల్లో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా.. కొన్ని సున్నితమైన అంశాలను స్పృశించారు. రెండు సామాజిక వర్గాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ బీజేపీ నాయకులు విమర్శిస్తోన్నారు. రామ్ సనేహీ ఘాట్ వద్ద వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఓ మసీదును యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చివేశారని ఒవైసీ ఆరోపించారని బీజేపీ నేతల వాదన.
ప్రధాని, సీఎంపై..
అలాగే- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లపై అభ్యంతరకరమైన పదాలను ప్రయోగించారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ కూడా ఒవైసీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు బారాబాంకీ సిటీ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వేర్వేరు సెక్షన్ల కింద అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు బారాబాంకీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యమునా ప్రసాద్ తెలిపారు.